Medico Preethi suicide case(Today breaking news in Telangana) : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో.. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఆమె ఆత్మహత్యకు కారణాలను వెల్లడించారు. కులం పేరుతో దూషించడం వల్లే ఆమె ప్రాణాలు తీసుకుందని, ప్రధాన నిందితుడు సీనియర్ సైఫ్ అని చార్జిషీట్ లో తేల్చిచెప్పారు. ఈ క్రమంలో తీవ్ర డీప్రెషన్ లోనైన ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య ప్రయత్నించిందని చార్జిషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. 5 రోజులపాటు చికిత్స తర్వాత ప్రీతి ఫిబ్రవరి 26 న మృతిచెందినట్లు వివరించారు.
మొత్తం 970 పేజీలతో చార్జిషీట్ ను పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసులో 70 మంది సాక్షులను విచారించామని పేర్కొన్నారు. సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు, నిందితుడు, అతడి ఫ్రెండ్స్ వాడిన సెల్ఫోన్ల డేటాను పరిశీలించి.. సాక్ష్యధారాలు సేకరించాక.. విచారణలో మెడికో ప్రీతిని డాక్టర్ సైఫ్ ర్యాగింగ్ పేరుతో వేధించాడని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడని రుజువు అయ్యిందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రీతి మృతిపై 306, 354 సెక్షన్ల క్రింద మట్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని తెలిపారు.
మరోవైపు ఇన్నాళ్లూ మూసి ఉన్న ప్రీతి రూమ్ ను బుధవారం పోలీసులు ఓపెన్ చేశారు. ప్రీతి కుటుంబ సభ్యుల సమక్షంలో రూమ్ ను తెరిచారు. ప్రీతికి చెందిన స్టడీ మెటీరియల్స్తోపాటు మెడిసిన్, ఇతర సామాగ్రిని వారికి అందజేశారు. ప్రీతి మృతితో ప్రభుత్వం ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఆమె సోదరికి ఉద్యోగం కూడా కల్పించింది.