MLA muthireddy yadagiri reddy news(Telangana today news): బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయన కూతురు తుల్జాభవానీ మధ్య వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చేర్యాలలో తన తండ్రి.. ఓ భూమిని కబ్జా చేసి.. తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించిన తుల్జా భవానీ.. ఆ భూమిని తిరిగి మున్సిపాలిటీకి అప్పగించింది. పైగా ముత్తిరెడ్డి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ని స్థానికులతో కలిసి తొలగించింది.
ఈ వ్యవహారంలో మొదట ఆమెతో పాటు స్థానికులపై కేసులు పెట్టిన పోలీసులు.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. భవానీపై కేసు తొలగించారు. ఆమె వెంట నిలిచిన వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారని అంటున్నారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిపోరుకు కారణాలేంటని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇన్నేళ్లుగా బయటకు రాని కుటుంబ వివాదాలు ఇప్పుడు ఒక్కసారిగా రోడ్డున పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కన్న కూతురు తుల్జా భవాని రెడ్డి తండ్రిపై ఫిర్యాదు చేయడం వెనుక ఎవరున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తండ్రి అక్రమంగా తన పేరుపై భూమి కొనుగోలు చేశారని బహిరంగంగా చెప్పడం వెనుక రాజకీయ కోణం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తుల్జా భవాని రెడ్డిని బీఆర్ఎస్ నేతలే వెనకుండి నడిపిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ముత్తిరెడ్డి రాజకీయ జీవితానికి తన సొంత కూతురి ద్వారానే చెక్ పెట్టాలని అధిష్టానం చూస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.