Telangana power lost Rs 6K crore: తెలంగాణ విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్కు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది.
బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా, ఛత్తీస్గఢ్కు భారీగా సొమ్ములు చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించాయి. ఛత్తీస్గఢ్తో జరిగిన పీపీఏ పరిణామాలపై అటు ప్రభుత్వానికి, ఇటు జ్యుడిషియల్ కమిషన్కు తెలంగాణ విద్యుత్ డిస్కంలు సమగ్ర సమాచారం అందజేశాయి.
2017 చివర్లో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా మొదలైంది. పీపీఏలో ప్రస్తావించినట్టుగా 1000 మెగావాట్లు ఎన్నడూ పూర్తి కాలేదు. బకాయిల చెల్లింపుల వివాదంపై రెండేళ్ల కిందట నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒప్పందం ప్రకారం 2017-2022 వరకు పూర్తి స్థాయిలో కరెంటు రాకపోవడం వల్ల ఓపెన్ మార్కెట్లో రెండు వేల కోట్ల పైచిలుకు చెల్లించి విద్యుత్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు అందులో వివరించాయి.
Also Read: KCR Power Purchase Issue: కేసీఆర్కు కరెంటు షాకులు.. చత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంలో తిరకాసులేంటి?
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తెచ్చుకునేందుకు పవన్ గ్రిడ్ కార్పొరేషన్తో 1000 మెగావాట్ల సరఫరాకు లైన్ కారిడార్ను అద్దెకు తీసుకునేందుకు తెలంగాణ డిస్కంలు రిజర్వు చేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. లైన్ బుకింగ్ ప్రకారం విద్యుత్ తెచ్చుకున్నా, తెచ్చుకోకపోయినా దాదాపు 638 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలు కట్టారు. దీనికితోడు మరో 1000 మెగావాట్ల సరఫరాకు అడ్వాన్సుగా కారిడార్ నుంచి గత ప్రభుత్వం రిజర్వు చేసుకుంది.
ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నది తెలంగాణ డిస్కంలు చెబుతున్నమాట. 261 కోట్ల రూపాయలు కట్టాలని పవన్ గ్రిడ్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. కారిడార్ రిజర్వు ఒప్పందం హడావుడిగా చేసుకోవడంతో అదనపు చెల్లింపు సమస్య తలెత్తిందని కమిషన్ ముందు డిస్కంలు తెలిపాయి.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగుస్తున్న ఉచ్చు.. నెక్ట్స్ టార్గెట్ పెద్దాయనే..
వాస్తవానికి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి తెలంగాణ ఈఆర్సీ నుంచి ఇప్పటివరకు ఆమోదం వేయలేదు. దీంతో వేలాది కోట్ల రూపాయలు అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.