Cm kcr: అల్లూరి సీతరామారాజు 125 జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హకీంపేట ఎయిర్ పోర్టులో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఘనస్వాగతం పలికారు. అయితే రాష్ట్రపతి స్వాగతం పలికే కార్యక్రమంలో కాసేపు ముచ్చటించుకున్నారు తమిళిసై, కేసీఆర్. మొన్నటి వరకు రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య చాలా గ్యాప్ ఉంది. గవర్నర్ తో మంత్రులు ఢీ అంటే ఢీ అన్నారు. బిల్లులను దగ్గరపెట్టుకుని ఆమోదించడం లేదని… ఆరోపించారు . అయితే ఇటీవల సీన్ మారింది.గవర్నర్తో సఖ్యతగా ఉంటోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రపతి పర్యటనలోనూ ఇదే కనిపించింది.
బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజీ కుదిరిందని… గత కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్. రెండు పార్టీలు ఒకటేనని చెబుతోంది. మొన్నటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. కాని గత కొద్ది రోజుల నుంచి సీన్ మారిందని… బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కూడా ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.
ప్రగతిభవన్,రాజ్భవన్ మధ్య రాజీ కుదిరినట్టేనా? అయితే సోమవారం కూడా మంత్రి హరీష్రావు గవర్నర్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి విషయంలో గవర్నర్ హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారని పరోక్ష కామెంట్స్ చేశారు హరీష్రావు.ఈ వ్యాఖ్యలకు గవర్నర్ తమిళిసై కూడా కౌంటరిచ్చారు. విమర్శలు పట్టించుకోనని ఉస్మానియాలో వసతులు సరిగ్గా లేవన్నారు. అంతేకాదు… ప్రభుత్వాన్ని పొగడటం తన బాధ్యత కాదంటూ కౌంటరిచ్చారు. కానీ ఒక్కరోజు వ్యవధిలోనే కేసీఆర్, గవర్నర్ మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.