Revanth Reddy News : రాజకీయ నాయకులకు అల్టిమేట్గా కావాల్సింది పవర్. అధికారం కోసం తిట్టుకుంటారు, అవసరమైతే కౌగిలించుకుంటారు. కాని, జనాలకు మాత్రం ఎప్పుడూ ఓ క్లారిటీ ఉంటుంది. దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు. అమిత్ షా- చంద్రబాబు భేటీపై తెలుగు రాష్రాల్లో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. పొత్తుపై పార్టీల్లో నేతల అభిప్రాయం ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారన్నది తరువాత సంగతి. అసలు తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంకు ఎక్కడిది? ఇదే మెయిన్ ప్రశ్న. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ నిలబడితే జస్ట్ 5వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. మూడు జిల్లాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కేవలం 5వేల ఓట్లా?
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో, ఆ మాటకొస్తే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఓటు గెలుపుని నిర్దేశిస్తుంది. ఇది నిజం. కాని, ఆ ఓటు మొత్తం ఎప్పుడో టీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయింది. మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వైపు నిలబడినట్టు కనిపించింది. కాని, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తరువాత టీడీపీ ఓటర్లు రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి వైపు ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ ఓటర్లు బీజేపీకి ఓటు వేశారు. కాని, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఏదో జరుగుతోందన్న వార్తలతో ఇప్పుడు అల్టిమేట్గా కాంగ్రెస్ వైపే షిఫ్ట్ అవుతున్నారు.
ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఇప్పటికీ చెప్పుకోదగ్గ ఓటర్లు ఉన్నారు. మహబూబ్నగర్, నిజామాబాద్, హైదరాబాద్ ఏరియాలో టీడీపీకి ఓటర్లు ఉన్నారు. అందుకే, ఏ మాత్రం ఛాన్స్ వదులుకోదలచుకోని బీజేపీ.. టీడీపీతో ఓ ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కాని, వీళ్లంతా రేవంత్ రెడ్డి వెనకే నడుస్తారని కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి.