BJP : తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో జోష్ తగ్గింది. బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ముందుకురావడంలేదు. కర్ణాటక ఎన్నికలకు ముందు కాషాయ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిన నేతలు వెనక్కితగ్గారు. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ 15న ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ముఖ్య నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరి భద్రాచలానికి వెళతారు. అక్కడ అమిత్ షా శ్రీరాముడిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.20 గంటల మధ్యలో రాములోరి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేస్తారు.
ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి శంషాబాద్కు బయలుదేరతారు. రాత్రి 7 గంటలకు కొందరు నేతలతో వేర్వేరుగా సమావేశమవుతారు. రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్ షా ఢిల్లీకి తిరిగి వెళతారు.
తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన జరుగుతుందని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారని టాక్ వినిపిస్తోంది. ఆ పదవి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ఇస్తారని వార్తలు వస్తున్నాయి.ఈటల రాజేందర్ను త్వరలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్గా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీలో గ్రూప్ వార్ బయటపడింది. కొందరు నేతలు బండి సంజయ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు నాయకులు ఈటలకు జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తిని రేపుతోంది.