Telangana congress news(TS politics) : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. నేడు గాంధీభవన్లో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. పార్టీ సంస్థాగత అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత టీకాంగ్రెస్ లో జోష్ పెరిగింది. పార్టీలో చేరేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు. చేరికల తర్వాత పార్టీ మరింత బలపడనుంది. అందుకే చేరికలపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా దృష్టి పెట్టింది. బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చే కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
మరోవైపు ఎన్నికల హామీలపైనా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గతేడాది రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కొన్నిరోజుల క్రితం ప్రియాంక గాంధీ హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ వెల్లడించారు. త్వరలో బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, SC, ST డిక్లరేషన్లు ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. మరోవైపు ప్రచారంపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అగ్రనేతల వరుస పర్యటనలు ఉండేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది.