Telangana Bjp: ఒకరు పార్టీ మారడం పక్కా అంటారు.. మరోకరు నెక్ట్స్ అధ్యక్షుడిని తానే అంటారు.. మరొకరు అంతా అధిష్టానం ఇష్టం అంటారు.. ఇలా పూటకో మాట.. రోజుకో ప్రచారంతో తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోందన్న ఆందోళన పార్టీ నేతల్లో నెలకొంది. పార్టీ చీఫ్ బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఢిల్లీలో ప్రత్యక్షమవడంతో ప్రచారం మరింత జోరందుకుంది.
ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేశారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందోనని చర్చ మొదలైంది. ఇక తెలంగాణ బీజేపీలో రఘునందన్ రావు ఎపిసోడ్.. తీవ్ర ఉత్కంఠను రేపింది. స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా.. కీలక నేతలంతా ఢిల్లీలోనే మకాం వేసిన వేళ.. అకస్మాత్తుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. హస్తినలో ప్రత్యక్షం కావడం.. ఆసక్తికరంగా మారింది. తాను బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నానని.. తన కన్నా బాగా పనిచేసే నాయకుడు పార్టీలో ఉన్నారా..? అంటూ చిట్ చాట్ సందర్భంగా.. రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీలో లుకలుకలు తీవ్రంగా ఉన్నాయనే ఊహాగానాలు వచ్చాయి. అయితే విషయం సీరియస్ అయ్యేసరికి.. రఘునందన్.. మీడియా ముందుకు రావాల్సి వచ్చి… చిట్ చాట్ లో తాను అన్న మాటలను తప్పుగా ప్రసారం చేశారన్నారు.
ఇటీవలే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడుతారని ప్రచారం జరిగింది. దీంతో వారిని హస్తినకు పిలిపించి రెండు రోజుల పాటు చర్చలు జరిపారు కాషాయ అగ్రనేతలు. దీంతో ఈ వివాదం సద్దుమణిగిందనుకున్నారు. అంతలోనే ఈటలను ఢిల్లీకి పిలవడం.. రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. మరి ఈ పంచాయితీని బీజేపీ అధిష్టానం ఎలా తీరుస్తుందో చూడాలి.
ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు రానున్నారు. వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర నేతలు ఈ ఏర్పాట్లను మొదలుపెట్టగా.. అంతలోనే ఈ కలకలం మొదలవ్వడంతో బీజేపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.