Summer in Telugu States (AP & TS News) : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీలో చాలా ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. రాష్ట్రంలో కొన్నిరోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటె ఎక్కువగా నమోదయ్యాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటె సగటున రెండు డిగ్రీల పెరిగినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
అత్యధికంగా రెంటచింతలలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్టోగ్రత నమోదైంది. కర్నూలులో 41.5, రాజమండ్రిలో 40.5 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులపాటు వేడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అడ్డతీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, రాజవొమ్మంగి, వరరామచంద్రపురం, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
రోహిణి కార్తీలో ఎండలకు రోళ్లు పగులుతాయంటారు. కానీ కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఏప్రిల్ నెలలోనే ఎండలకు బండ రాయి పగలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని నరసప్ప దేవాలయం వద్ద ఉన్న పెద్ద బండరాయి పగిలింది. పగిలి బండరాయిపై మరో బండరాయి ఉండటంతో ఎక్కడ పడిపోతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
తెలంగాణలోనూ ఎండల తీవ్రత క్రమంగా పెరిగింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 4 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
సోమవారం మహబూబ్నగర్ లో 39.8, నల్లగొండలో 39.5, నిజామాబాద్లో 39, రామగుండలో 39, ఖమ్మంలో 39, భద్రాచలంలో 38.6, మెదక్ లో 38.2, హనుమకొండలో 36.5, హైదరాబాద్ లో 36 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది.
స్కూల్కు వెళ్లే విద్యార్ధులు ఎండ వేడికి ఇబ్బందులు పడుతూ ఇంటికి చేరుకుంటున్నారు. వాహనాలపై వెళ్లే ప్రయాణికులు చెట్ల నీడ కింద ఆగి మరీ సేద తీర్చుకుంటున్నారు. ఏప్రిల్ నెల మొదటిలోనే ఎండలు ఇంతలా మండుతున్నాయి అంటే.. మే నాటికి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.