Hyderabad: హైదరాబాద్ లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా.. సాయంత్రం వెదర్ పూర్తిగా కూల్ గా మారిపోయింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం అయ్యింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, మీర్ పేట్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, ఛత్రినాక, శాలిబండ తదితర ప్రాంతాల్లో గాలితో కూడుకున్న భారీ వర్షం కురిసింది. దిల్ షుఖ్ నగర్, మలక్ పేట, చైతన్య పురి, కొత్తపేట వంటి ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసాయి.
మరోవైపు హైకోర్టు వద్ద గల సిటీ కాలేజ్ రోడ్డు సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. సాయంత్రం వర్షానికి తోడు ఈదురుగాలుల ధాటికి సిటీ కాలేజ్ ఎదుట ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కారు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రాకపోకలు మళ్లించి.. చెట్టును తొలగించారు. ఇటు రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ వెనుక ప్రాంతంలోని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రాంగణంలో.. పిడుగు పడింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఓ కొబ్బరి చెట్టు కాలిపోయింది.
ఇటు ఎండలు.. అటు వానలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మాడు పగిలే ఎండలతో మధ్యాహ్నం బయటకు వెళ్లలేకపోతున్నారు. సాయంత్రం వెళ్లాలనుకుంటే.. వర్షాలు పడటంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే ఎండవేడికి తట్టుకోలేకపోతున్న సమయంలో.. వర్షాలు పడటంతో.. వెదర్ మాత్రం కూల్ అయిపోతోంది.