Group-4 Exam : తెలంగాణలో మొన్నటి వరకు TSPSC పేపర్ లీకేజీలు కలకలం రేపాయి. అప్పటి నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సహా ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. తప్పిదాలకు పాల్పడితే చర్యలు తప్పని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే తాజాగా నిర్వహించిన గ్రూప్ -4 పరీక్షలో ఓ అభ్యర్థి సెల్ఫోన్తో పరీక్ష రాస్తూ దొరికిపోయాడు. హైదరాబాద్ సరూర్నగర్లోని సక్సెస్ కళాశాలలో పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఆ అభ్యర్థిని పట్టుకున్నారు. ఇన్విజిలేటర్ ఆ అభ్యర్థి నుంచి ఫోన్ తీసుకుని సీజ్ చేశారు.
మాల్ ప్రాక్టీస్ కింద సదరు అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఉదయం సెషన్లో గ్రూప్-4 పేపర్-1 పరీక్ష నిర్వహించారు. గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా 8,180 ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేశారు.శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు రాలేకపోయారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు పరీక్ష రాయకుండానే నిరాశతో వెనుదిరిగారు.