Sonia Gandhi Latest News(Telangana Politics) : సోనియాగాంధీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఆమె జూన్ మొదటి వారంలో హైదరాబాద్ వస్తారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో పీసీసీ ఆధ్వర్యంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణానికి సోనియా గాంధీ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించనున్నారు. జూన్ 1న లేదా మొదటి వారంలో ఈ కార్యక్రమం ఉంటుందని పీసీసీ వర్గాలు తెలిపాయి.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ బోయిన్పల్లి శివారులో 10 ఎకరాల స్థలం కేటాయించారు. ఇక్కడ గాంధీ ఐడియాలజీ సెంటర్ నిర్మాణానికి అనుమతి కోరుతూ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కంటోన్మెంట్ బోర్డుకు గతంలో దరఖాస్తు చేశారు. తాజాగా కంటోన్మెంట్ బోర్డు పాలకమండలి జీ + 2 భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని టీపీసీసీ యోచిస్తోంది.
గాంధీ ఐడీయాలజీ సెంటర్ పార్టీ జాతీయస్థాయి అవసరాలకు ఉపయోగపడేలా నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గాంధీ భావజాలాన్ని తెలిపే లైబ్రరీ, పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా థియేటర్ ఏర్పాటు చేస్తారు. గాంధీ కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చినప్పుడు విడిది ఇక్కడే ఏర్పాటు చేస్తారు. ఏఐసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక ఛాంబర్ ఉంటుంది. పార్టీ రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా భవనాన్ని నిర్మిస్తారు. ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఏయే సౌకర్యాలతో భవనాన్ని నిర్మించాలనే అంశంపై పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయి.