Sarpanch Navya news today(Political news in telangana): సర్పంచ్ నవ్య ఎపిసోడ్ లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చారు. ఈ వ్యవహారంలో రెండుసార్లు నవ్యకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఆమె మాత్రం ఎలాంటి ఆధారాలును సమర్పించలేదన్నారు. దీంతో ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు నిర్ధారించారు. ఎమ్మెల్యే రాజయ్యకు క్లీన్ షీట్ ఇస్తూ జాతీయ మహిళా కమిషన్కు నివేదిక సమర్పించారు.
నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించని నేపథ్యంలో ..కేసు క్లోజ్ చేయవచ్చని నవ్య పోలీసులకు తెలిపింది. దీంతో ప్రస్తుతానికి సర్పంచ్ నవ్య-ఎమ్మెల్యే రాజయ్య మధ్య వివాదం ముగిసింది.
ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య కొన్నిరోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఈ విషయంలో రాజీ చేసుకునేందుకు రాజయ్య ప్రయత్నించారు. స్వయంగా సర్పంచ్ ఇంటికే వెళ్లారు. ఆ గ్రామానికి రూ. 25 లక్షల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా సరే అక్కడ ప్రెస్ మీట్ లో రాజయ్య ఎదుటే నవ్య ఘాటుగా ఆరోపణలు చేశారు.
కొన్ని రోజుల క్రితం నవ్య మరోసారి రాజయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామానికి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. తన భర్తకు డబ్బులు ఇచ్చిన తనను సంతకం పెట్టమని బలవంతం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే తనను రాజయ్య అనుచరులు ఫోన్ చేసి లైంగికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆడియో కాల్స్ సంచలనం రేపాయి. ఈ వివాదం తర్వాత ఇటీవల ఆ గ్రామానికి ఎమ్మెల్యే రాజయ్య నిధులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ నవ్య-ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ ఇప్పుడు ముగిసింది.