Revanth Reddy Latest News(Telangana News Updates): 111 జీవో రద్దుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవో రద్దు చేశారని.. ఎకరాకు 5 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల కుంభకోణం ఉందన్నారు. కేటీఆర్, కవిత, సంతోష్ కుమార్, ఎంపీ రంజిత్లు పెద్ద ఎత్తున భూములు కొన్నారని.. యువరాజు సన్నిహితులకు లబ్ధి చేకూర్చేందుకే 111 జీవో రద్దు చేశారని రేవంత్ విమర్శించారు. దావూద్ నైనా క్షమించొచ్చు కానీ, కేసీఆర్, కేటీఆర్లను క్షమించలేమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ అస్తవ్యస్థ నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 80శాతం భూములు కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లాయన్నారు. మొత్తం భూములు పేదల నుంచి కొనుగులు చేశాక ఇప్పుడు జీవో రద్దు చేశారని ఆరోపించారు. కేసీఆర్ నిర్ణయం హిరోషిమాపై పడిన ఆటంబాబు కన్నా దారుణమన్నారు. 111 జీవో రద్దుతో జంటనగరాలు విధ్వంసం అవుతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 111 జీవోతోనే జంట జలాశయాలను కాపాడరన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ఒప్పందం ఉందని.. జంట నగరాలను కాపాడాలన్న చిత్తశుద్ది ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ దర్యాప్తు ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలన్నారు రేవంత్. ఈ వ్యవహారంపై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మాస్టర్ ప్లాన్ లేకుండా లక్షా 30వేల ఎకరాలకు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదని నిలదీశారు. 111 జీవో రద్దుపై విచారణ జరపాలని.. కాంగ్రెస్ తరఫున నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఎవరెవరు భూములు కొన్నారో తేల్చుతామని హెచ్చరించారు పీసీసీ చీఫ్.