Rahul Gandhi News Updates(Congress public meeting khammam) : తెలిసో.. తెలియకో.. ఆవేశంలోనో.. అనాలోచితంగానో.. రీజన్ ఏదైనా పార్టీని వీడిన వారంతా తిరిగి వచ్చేయాలని పిలుపునిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తిరిగి మీ సొంత గూటికి వచ్చేయాలని పిలుపునిస్తోంది. మొన్నటి వరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే నేతలకు విజ్ఞప్తి చేయగా.. ఈ సారి ఏకంగా రాహుల్ గాంధీ కూడా సెకండ్ థాట్ లేకుండా పార్టీలో చేరి కండువా కప్పేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మాజీ కాంగ్రెస్ నేతలు బీజేపీలో ఉన్నా.. బీఆర్ఎస్లో ఫికర్ పడకుండా.. సొంతిళ్లు లాంటి కాంగ్రెస్కు వచ్చేయాలని పిలుపునిస్తున్నారు రాహుల్. మీ కోసం పార్టీ తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయని చెబుతున్నారు.
కాంగ్రెస్ మాజీ నేతలు ప్రస్తుతం బీజేపీలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో హస్తం నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే దీనికి తగ్గట్టుగానే ఇటీవల వారి వ్యాఖ్యలు ఉన్నాయి. బీజేపీ అధిష్టానం సూచనతో సంజాయిషీలు ఇచ్చినా.. వారు కాంగ్రెస్లో చేరుతున్నారనే ప్రచారం మాత్రం ముమ్మరంగా కొనసాగుతోంది.
నిజానికి ఎన్నికలకు ముహుర్తం దగ్గరపడుతుండడంతో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ జోష్ పెంచింది. కర్ణాటకలో గెలుపుతో జోష్లో ఉన్న కాంగ్రెస్ అదే ఉత్సాహంతో తెలంగాణలోనూ పాగా వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీకి దూరంగా ఉన్న నేతలను మళ్లీ క్రియాశీలకం చేయడంతో పాటు.. అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఆశాజనక పరిస్థితులు ఉండడంతో ఇతర పార్టీల్లో ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
అధికార బీఆర్ఎస్లో ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు పోటీపడుతున్నారు. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీల్లో కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డికి సైతం తలనొప్పులు మొదలయ్యాయి. అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రెండు వర్గాలకు చీలిపోయి కుమ్ములాటలు నిత్యం జరుగుతున్నాయి. దీంతో ఉక్కబోతకు గురవుతున్న కొందరు సీనియర్లు పక్కచూపులు చూస్తున్నారు. ఇటీవల బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరెడ్డి మరికొందరు నేతలు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిస్థితుల తరువాత బీజేపీలోకి వెళ్లే విషయంలో కొందరు పునరాలోచనలో పడ్డారు. వీరిలో ఎక్కువ మంది ఇపుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ను సైతం పార్టీలోకి ఆహ్వానిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అన్నట్టుగా ప్రస్తుతం రాజకీయం ఉంది. ఎవరికి వారే ఉంటారన్న రూమర్స్ను పక్కకు తోసి.. అగ్రనేతలంగా ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ నేతలపై విరుచుకపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ను కూడా జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చేరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు పార్టీ కోసం ఒకటి కాదు.. పదిమెట్లు దిగుతానని రేవంత్ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతోనే కాంగ్రెస్లో చేరాలనుకున్న వారికి కాస్త ధీమా రాగా.. ఇప్పుడు రాహుల్ ఆహ్వానంతో అది మరింత పెరిగిందనే చెప్పాలి.