Ponguleti latest news(Telangana politics): ఎట్టకేలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సస్పెన్స్ కు తెర దించారు. రకరకాల ఉహాగానాలు షికారు చేస్తున్న తరుణంలో వాటన్నింటికీ చెక్ పెడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ను గద్దె దించే సత్తా ఉన్నకాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు.
ఖమ్మంలో తన అనుచరులతో సమావేశమైన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ నెల 12న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. తన చేరికతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చెయ్యొచ్చని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సన్నిహితులతో చెప్పారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. అధికార బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ విధానాలను వీరిద్దరూ చాలాకాలం నుంచి బహిరంగంగానే ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నాయకులిద్దర్ని బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి, జూపల్లిని చేర్చుకునేందుకు.. అటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం అనేక దఫాలుగా బహిరంగ, రహస్య చర్చలు కూడా జరిగాయి. కాంగ్రెస్ కు సంబంధించిన ఢిల్లీ దూతలు హైదరాబాద్ లో చర్చలు జరపగా.. బీజేపీకి చెందిన సుమారు ఇరవైమంది ముఖ్యనాయకులు ఖమ్మంకు వెళ్లి చర్చించారు. ఒకానొక దశలో సొంత పార్టీ ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది.
తాము ఏ పార్టీలో చేరాలన్న విషయంపై ఆచితూచి వ్యవహరించిన పొంగులేటి, జూపల్లి.. బీఆర్ఎస్ ను దెబ్బతీయడంపై తీవ్ర కసరత్తు చేశారు. అధికార బీఆర్ఎస్ ను దెబ్బకొట్ట గల సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని నిర్ధారణకు వచ్చారు. ముందుగా బీజేపీ వైపు చూసినా.. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్న మెతక వైఖరితో విసిగిపోయారన్న ప్రచారం సాగింది.
ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు నిర్ణయంతో.. కోదండరాం వంటి బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ వ్యతిరేక శక్తులంతా కాంగ్రెస్ వైపు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.