Nampally Court Reserved Judgment on Phone Tapping Case: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారానికి రిజర్వు చేసింది.
విచారణ సందర్భంగా.. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదంటూ నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. కేసులో అరెస్ట్ అయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే మ్యాండేటరీ/డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. 90 రోజుల్లోనే తాము ఛార్జిషీట్ వేశామని, అయితే, వివరాలు సరిగా లేవంటూ తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్లు పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదంటూ వారు పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి రిజర్వు చేసింది.
ఇది ఇలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఆ కీలక ఆధారాలను మొత్తం మూడు బాక్సుల్లో న్యాయస్థానానికి సమర్పించారు. అదేవిధంగా మూడో ఛార్జిషీట్ ను కూడా దాఖలు చేశారు. న్యాయస్థానానికి సమర్పించిన ఆధారాల్లో పెన్ డ్రైవ్ లు, సీడీలు, ఫోన్లు, హార్డ్ డిస్క్ లు ఉన్నాయి. వీటికి తోడు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ ల శకలాలలను కూడా అందజేసిన విషయం తెలిసిందే.
Also Read: మంత్రి దామోదర హామీ.. సమ్మె విరమించిన జూడాలు
అయితే, ఈ కేసుకు సంబంధించి తాము అందజేసినటువంటి వివరాలు బయటకు రాకుండా చూడాలంటూ కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. నిందితులెవరికీ వీటిని అందజేయకూడదని అందులో పేర్కొన్నారు.
మరో విషయం ఏమిటంటే.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తి రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. జూన్ 26న భారత్ కు వస్తానంటూ తొలుత తన వ్యాయవాది ద్వారా అతను కోర్టుకు వెల్లడించారు. తాజాగా సమర్పించిన మెమోలో మాత్రం తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో డబ్బులు తరలించిన వ్యవహారంలో ఆదేశాలు ఇచ్చినట్లు నిందితులు విచారణలో అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చినా, వారిని ఇంకా విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.