Roof collapse in Nagarkurnool(TS today news): తెలంగాణలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లాలోని వనపట్లలో భారీ వర్షానికి మట్టిమిద్దె కూలింది. ఈ ఘటనలో ఓకే కుటుంబంలో నలుగురు మృతి చెందగా.. ఇంటి యజమానికిి తీవ్ర గాయాలయ్యాాయి. ఇందులో గాయపడిన వ్యక్తిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వనపట్ల గ్రామంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ ఇంటి మట్టిమిద్దె కూలింది. ఇంట్లో గొడుగు భాస్కర్తోపాటు భార్య పద్మ(26), కూతుళ్లు తేజస్విని(6), వసంత(9), కుమారుడు రుత్విక్ నిద్రిస్తున్నారు. ఇల్లు ఒక్కసారి కూలడంతో భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు మృతి చెందారు.
అభం శుభం తెలియని ఆ ముగ్గురు చిన్నారులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మట్టి పెళ్లలు తొలగించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ తరఫున ఆర్థికసాయం అందించేలా కృషి చేస్తామన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
వర్షాలు కురుస్తున్న సమయంలో మట్టి ఇళ్లలో నివాసం ఉన్న వారికి పోలీసులు తగు సూచనలు చేశారు. అలాగే శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.