Etela Jamuna Press Meet(Breaking news updates in telangana): తెలంగాణలో మర్డర్ పాలిటిక్స్ మొదలయ్యాయా? విమర్శలు, తిట్లు.. హద్దు దాటి అంతుచూసే వరకు వెళ్తున్నాయా? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఎన్నికల వేళ రక్తపు ధారలు పారనున్నాయా? తెలంగాణలో అసలేం జరుగుతోంది? ఈటల రాజేందర్ను చంపాలని చూసేవరకు రాజకీయాలు దిగజారాయా? పాడి కౌశిక్ రెడ్డిపై ఈటల రాజేందర్ భార్య జమున చేసిన ఆరోపణలు దేనికి నిదర్శనం? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఈటల జమున. ఓపెన్ పాలిటిక్స్లో అంత యాక్టివ్గా ఏమీ ఉండరు. భర్తకు తెరవెనుక సపోర్ట్గా నిలుస్తారంతే. కుటుంబ వ్యాపారాల్లో నిత్యం బిజీగా ఉంటారు. అత్యవసరం అయినప్పుడు మాత్రమే తెరమీదకు వస్తుంటారు. అలా రేర్గా మీడియాతో మాట్లాడే జమున.. మరోసారి ప్రెస్మీట్ పెట్టారు. తన భర్త రాజేందర్ను చంపాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. పాడి కౌశిక్రెడ్డి 20 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తనకు తెలిసిందని చెప్పారు. జమున వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి.
ఈటల జమున ఏదో యథాలాపంగా ఈ ఆరోపణలు చేశారని అనుకోలేం. భర్త హత్యకు కుట్ర జరుగుతుందని తెలిసి.. ఏ భార్య అయినా ఎలా భరించగలదు? గమ్మున ఎలా ఉండగలదు? అసలే ఎర్రజెండా పట్టి.. అడవుల్లో తుపాకీతో తిరిగిన విప్లవ మహిళ ఆమె. అలాంటిది జముననే కంగారుతో మీడియా ముందుకు వచ్చారంటే మాటలా? రాజేందర్కు ప్రాణహాని ఉందని కలత చెందినట్టేగా?
ఈటల దంపతులు విప్లవ, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు. తమ రాజకీయ ప్రస్థానంలో ఆ జంట అనేక బెదిరింపులు చూసే ఉంటారు. కానీ, మునుపెన్నడూ స్పందించని రీతిలో ఈసారి ఈటల జమున ఏకంగా మీడియా ముందుకు వచ్చి.. తన భర్త హత్యకు కౌశిక్రెడ్డి కుట్ర చేస్తున్నారని చెప్పడం సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డిని పిచ్చికుక్కగా తమ మీదకు వదిలారంటూ మండిపడ్డారు. హుజురాబాద్లో అరాచకాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కేసీఆర్, ఈటల రాజేందర్ల రాజకీయ వైరం జగమెరిగిందే. ధిక్కారముల్ సైతునా అంటూ ఈటలను కేబినెట్ నుంచి, బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టారు గులాబీ బాస్. ఈటల సైతం బానిస బతుకు బతకలేనంటూ.. ప్రగతిభవన్ గోడలు కూల్చేస్తానంటూ సవాల్ చేసి.. పార్టీని వీడారు. అనేక తర్జనభర్జనల తర్వాత బీజేపీలో చేరారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో హోరాహోరీ తలపడ్డారు. ఘన విజయంతో సీఎం కేసీఆర్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
పరాజయ భారంతో రగిలిపోతున్న కేసీఆర్.. పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెట్టి.. ఈటల మీదకు వదిలారు. ఆయన ఓ రేంజ్లో హుజురాబాద్లో చెలరేగిపోతున్నారు. ఈటలపై ఉన్న ధ్వేషంతో ఇటీవల ముదిరాజులపై చూపించారు కౌశిక్రెడ్డి. అసభ్య పదజాలంతో, ముదిరాజులను బూతులు తిడుతున్న ఆడియో వైరల్ కావడం.. తీవ్ర విమర్శలు చెలరేగడం తెలిసిందే. ఇలా ఈటల వర్సెస్ కౌశిక్రెడ్డిల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్.. భవిష్యత్తులో భౌతిక దాడులకు దారి తీయనుందా? ఈటల దూకుడును అడ్డుకోలేకపోతున్న కౌశిక్రెడ్డి.. ఆయన్ను భౌతికంగా అడ్డుతొలగించేందుకు కుట్ర చేస్తున్నారా? జమున ఆరోపించినట్టు.. రాజేందర్ను చంపేందుకు కౌశిక్రెడ్డి 20 కోట్లు ఇస్తాననడం నిజమే అయితే.. తెలంగాణలో హత్యా రాజకీయాలకు తెరతీసినట్టే అవుతుందనో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గ్యాంగ్ స్టర్ నయీం రెక్కీ చేస్తేనే భయపడలేదు.. కౌశిక్రెడ్డికి భయపడతానా? అనేది ఈటల ఆన్సర్.
అటు.. ఈటల జమున ఆరోపణలకు అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి. తాను ఈటలను చంపాలని చూడటం కాదు.. రాజేందరే గతంలో తనను చంపే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈటల చేయించిన హత్యలు ఇవే అంటూ పెద్ద లిస్టు చదివి వినిపించారు కౌశిక్రెడ్డి. పేదోళ్లు, దళితుల భూములు ఆక్రమించిన వ్యక్తి ఈటల రాజేందర్ అని.. ఆయన ఈటల కాదు.. చీటర్ రాజేందర్ అంటూ రివర్స్ కౌంటర్ వేశారు.