Congress : తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ రోజురోజుకు మారుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఆ పార్టీకి తెలంగాణలో ఊపు తెచ్చింది. హస్తంతో చేతులు కలిపేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది.
ఆదివారం జరిగే ఈ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు భారీగా కాంగ్రెస్ కండువాలు కప్పుకోబోతున్నారు. ఖమ్మం సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇదే జోష్ ను కంటిన్యూ చేయాలని అనుకుంటోంది.
ఖమ్మం సభ తర్వాత కూడా చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరతారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమతో టచ్లో ఉన్నారని వెల్లడించారు. ఖమ్మం సభ తర్వాత మిగతా నేతలు కాంగ్రెస్ లో చేరతారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరిగిందని వివరించారు. పార్టీలో నేతల మధ్య మంచి కో ఆర్డినేషన్ ఉందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలపై ఠాక్రే స్పందించారు. కేసీఆర్ కు ఆర్భాటం తప్ప ఏమీ లేదని విమర్శించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.