KTR : తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిద్ధిపేట, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత డిపో గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం హుస్నాబాద్ నుంచి హనుమకొండ పర్యటనకు వెళ్తారు.
హనుమకొండలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. రూ.5.20 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం, సైన్స్ పార్కులను ప్రారంభిస్తారు. తెలంగాణ స్టేట్ సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్ భవనాన్ని ప్రారంభిస్తారు. రూ.128 కోట్లతో చేపట్టే 17 పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
హసన్పర్తి కిట్స్ కాలేజీలో ఇన్నోవేషన్ హబ్ను, హనుమకొండలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియల్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ స్థలాన్ని మంత్రి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ పరిశీలించారు.
మరోవైపు హనుమకొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు, పలువురు జూనియర్ పంచాయతీ సెక్రటరీలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ 4వ డివిజన్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ యాదవ్ ను, AIYF రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ 46 డివిజన్ అధ్యక్షుడు ముత్తోజు సురేష్, జిల్లా నాయకులు గడ్డం మహేందర్ ను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.