CM KCR Latest News(Telangana Updates): కేసీఆర్ను ఐక్యంగా ఆకాశానికెత్తేశాయి వామపక్షాలు. వచ్చే ఎన్నికల్లో కారు సపోర్టుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. మే డే రోజున కామ్రేడ్లకు షాకింగ్. సీపీఎం, సీపీఐకి ఒక్క సీటు కూడా ఇచ్చేందుకు గులాబీ దళపతి సిద్ధంగా లేరని టాక్.
మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసింది కేసీఆర్, వామపక్షాల ముచ్చట. బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ దళపతి.. అక్కడ బలమున్న వామపక్షాల సాయం తీసుకున్నారు. కేసీఆర్ స్నేహహస్తం అందించడంతో కామ్రేడ్లు కూడా ఖుషీ అయ్యారు. మునుగోడులో వాళ్ల వ్యూహం బాగానే వర్కవుట్ అయింది. కాంగ్రెస్ను వీడి బీజేపీ పంచన చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. అక్కడి నుంచి వామపక్షాలు, బీఆర్ఎస్ మధ్య స్నేహబంధం బలపడుతూ వచ్చిందనే చెప్పాలి. తెలంగాణలో అంతంతమాత్రంగా ఉన్న వామపక్షాలు.. కేసీఆర్పై భారీ ఆశలే పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్తో దోస్తీ ఖాయమని భావించారు. అధికార పార్టీపై పోరాటాలు చేసే కామ్రేడ్లు.. బీఆర్ఎస్తో కలిసి వెళ్లడాన్ని ప్రశ్నించిన వారికి.. బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. కమలాన్ని కొట్టాలంటే కేసీఆర్ వంటి శక్తులకే సాధ్యమని.. సాయంగా వెళ్తే తప్పేంటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్న. పొత్తు కోసం ఆశతో ఎదురు చూస్తున్న వారికి.. కేసీఆర్ హ్యాండివ్వబోతున్నారా? గులాబీ దళపతి మౌనం దేనికి సంకేతం?
ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు ఫిక్సయిపోయినట్టు.. సీట్ల లెక్కలు వేసుకుంటూ.. ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా కామ్రేడ్లు చర్చ మొదలుపెట్టేశారు. పైకి ఐక్యరాగం ఆలపించినా.. లోపల ఉప్పునిప్పులా ఉంటే సీపీఎం, సీపీఐ.. బీఆర్ఎస్తో దోస్తానాకు కలిసి వెళ్తే ఎక్కువ సీట్లు వస్తాయనే లెక్కలూ వేసుకుంటున్నారు. ముఖ్యంగా.. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు, కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, ఓ ఎమ్మెల్యే అధ్యక్షతన హైదరాబాద్లో ప్రగతిభవన్కు కూతవేటు దూరంలో సమావేశం అయ్యారు. కేసీఆర్కు సన్నిహితంగా వుండే ఓ ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలేరు స్థానాన్ని సీపీఎం అడుగుతోందనే చర్చకు తెరతీశారు కొందరు నాయకులు. అదేంటి.. అసలు లెఫ్ట్ పార్టీలకు టికెట్లిచ్చే ఆలోచన కేసీఆర్కు లేదని సదరు ఎమ్మెల్సీ స్పష్టంగా చెప్పేశారు. దీంతో లెఫ్ట్ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. సీపీఎంతో పొత్తుపై మాట్లాడాల్సి వస్తే ఆ బాధ్యత కేసిఆర్ తనకే అప్పగిస్తారని కూడా ఆ ఎమ్మెల్సీ చెప్పినట్టు సమాచారం.
అటు.. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఆలోచన మరోలా ఉంది. పొత్తు కోసం కేసీఆర్పై ఒత్తిడి పెంచండి.. పాలేరు, కొత్తగూడెం స్థానాలు అడగండని దావత్ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారని అదే సమావేశంలో ఎమ్మెల్సీకి గుర్తుచేశారు కామ్రేడ్లు. ఆ విషయం కూడా తనకు తెలుసని ఆ ఎమ్మెల్సీ చెప్పడంతో మళ్లీ ఖంగుతిన్నారు వామపక్ష నాయకులు. అంతేకాదు కేటీఆర్కు ఆ మంత్రి అత్యంత సన్నిహితుడని మీరంతా అనుకుంటారు.. కానీ ఆయనకంత సీన్ లేదని కూడా తేల్చేశారట. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక కాని.. స్థానిక సంస్థల ఎంఎల్సి అభ్యర్థి ఎంపికలో కానీ, రాజ్యసభ సభ్యుల విషయంలో కానీ.. జిల్లా మంత్రిది నడవలేదని గుర్తు చేసే సరికి కామ్రేడ్లు కిమ్మనలేదని సమాచారం.
హైదరాబాద్లో రహస్యంగా పెట్టుకున్న సమావేశం వివరాలు బయటకు రావడంతో ఖమ్మం ఖిల్లాలో ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్కు సన్నిహితంగా వుండే ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు జిల్లా మంత్రి చెవిలో కూడా పడ్డాయి. లెఫ్ట్ పార్టీల రాష్ట్ర కార్యదర్శులకూ తెలీడంతో వారు ఆగ్రహంగా ఉన్నారని చెప్తున్నారు. మరి, ఫ్యూచర్లో ఏం చేస్తారో చూడాలి.