Bhatti Vikramarka Comments On Singareni: సింగరేణి ఉద్యోగాల గని, తెలంగాణకే తలమానికం అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణిలో 42వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారని, 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగుతోందని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రం మొదలు పెడుతోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంట్లో బొగ్గు గనుల వేలానికి సంబంధించి బిల్లు పెడితే బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు అన్నారు. ఆ నాడు బిల్లు పాస్ చేయడానికి సహకరించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పడు కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లుందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా బీఆర్ఎస్ తీరును ఎండగట్టారు. గోదావరి వ్యాలీలో బొగ్గు గనులు సింగరేణిలోకి తీసుకోవద్దని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నారన్నారు. కొంత మంది వ్యక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోయగూడం బ్లాక్, సత్తుపల్లి బ్లాక్ రెండూ బ్లాకులను అరబిందో, అవంతిక కంపెనీలకు చెందటం కోసం సింగరేణిని బొంద పెట్టిన ఘనత కేసీఆర్ది అని చెప్పారు. తెలంగాణ బ్లాక్లను వదిలేసి ఒడిషాలోని బ్లాక్ వేలానికి సింగరేణిని పంపించారన్నారు. సింగరేణిని సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు.
Also Read: కారులో ఉండేదెవరు.. కాంగ్రెస్ లో చేరేదెవరు ? ఆపరేషన్ ఆకర్ష్ తో గులాబీపార్టీ పరేషాన్
సింగరేణి బొగ్గు గనులను వేలం వేయొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తామన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అన్ని పార్టీలను కలుపుకోని వెళ్తామన్నారు. ఇప్పటికే వేలం వేసిన రెండు బొగ్గుగనులను సింగరేణికి కేటాయించాలని మంత్రి కిషన్ రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ కంపెనీలకన్నా ఎక్కువ మొత్తం ఇస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.