Singer Saichand death updates(Telangana news live) :తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్, ఉద్యమ గాయకుడు సాయిచంద్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ఆ సమయంలో సాయిచంద్ భార్య, పిల్లలు కేసీఆర్ కాళ్లపై పడి రోదించారు. కేసీఆర్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత సాయిచంద్ తండ్రి వెంకట్రాములను ఓదార్చారు.
సాయిచంద్ మృతదేహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సమయంలో కేటీఆర్ కంటతడి పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో తన అరుదైన కళా నైపుణ్యం, గాత్రంతో అలరించి సాయిచంద్ మరణం చాలా బాధాకరంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటన్నారు. హైదరాబాద్లో ఉంటే బతికేవాడేమోనని అన్నారు. స్వగ్రామానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. సాయిచంద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ భరసా ఇచ్చారు.
గుండెపోటుతో మృతిచెందిన సాయిచంద్ అంతిమయాత్ర గుర్రంగుడా నుంచి సాహెబ్ నగర్ వరకు సాగింది. అక్కడ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.