MLC Kavitha Chat(National News): హాయ్ అక్క. 15 కేజీల నెయ్యి రెడీ. ఏకే, ఎస్జేలకు ఓ మాట చెప్పండి. కేసీఆర్ గారిని అడిగినట్టు చెప్పండి… ఇలా సాగింది తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ సుఖేశ్ చంద్రశేఖర్ రిలీజ్ చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ మేటర్. సుఖేశ్ చాట్ చేసిన ఆ అక్క.. కవితక్కనే అని అంటున్నాడతను. కవితక్క టీఆర్ఎస్ పేరుతో ఉన్న నెంబర్తో సుదీర్ఘంగా చాట్ చేశాడు సుఖేశ్. అందులో నెయ్యి అంటే మనీ అని అతనే చెబుతున్నాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రి సత్యేంద్ర జైన్లు చెబితే.. తాను కవితకు విడతల వారీగా 45 కోట్లు ఇచ్చానని లేఖ రిలీజ్ చేసి జైలు నుంచే రాజకీయ కలకలం రేపాడు సుఖేశ్ చంద్రశేఖర్.
కట్ చేస్తే, సుఖేశ్ లేఖ ఆధారంగా కవితపై ఈడీ చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్రావు ఈడీని కలిసి ఫిర్యాదు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇదంతా తనకు మరింత ఉచ్చు బిగించే గేమ్ ప్లాన్లో భాగమేనని భావించిన ఎమ్మెల్సీ కవిత.. ఇక మరింత ఆలస్యం చేస్తే అసలుకే ఎసరు వస్తుందనుకున్నారో ఏమో.. సుఖేశ్ చంద్రశేఖర్తో తనకు ఎలాంటి పరిచయం లేదంటూ లేటెస్ట్గా క్లారిటీ ఇచ్చారు కవిత. ఇంతకీ ఆమె ఏమన్నారంటే…
నకిలీ చాట్లతో తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కవిత. కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక.. తనపై ఇలా దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఒక ఆర్థిక నేరగాడు అనామక లేఖ రాస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ లేఖను పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సీఈసీకి లేఖ రాశారని.. బీజేపీ టూల్కిట్లో భాగమే ఈ బురదచల్లే కార్యక్రమమని మండిపడ్డారు కవిత.