Latest political news telangana: పెద్దలు జానారెడ్డికి.. వయస్సురిత్యా మరింత పెద్దరికం వచ్చేసింది. వృద్ధాప్యంలో ఓటమి భారం మరింత కృంగదీస్తోంది. చాన్నాళ్లుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు. వారసుడి రాజకీయ భవిష్యత్తుపై ఫికర్ పట్టుకుంది. ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోనట్టు.. సోషల్ మీడియా ఆయనతో ఆటాడుకుంటోంది. జానారెడ్డి పార్టీ మారుతున్నారంటూ.. తరుచూ ప్రచారం జరుగుతోంది. వ్యూస్ కోసమో, సెన్సేషన్ కోసమో.. ఓ సెక్షన్ మీడియాకు మంచి సరుకుగా మారిపోతున్నారు పెద్దలు జానారెడ్డి.
ప్రస్తుతం కాంగ్రెస్లో మునుపెన్నడూ లేనంత జోష్ కనిపిస్తోంది. బీజేపీ ఎగిసి పడిన కెరటంలా చతికిలపడింది. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ కోసం రేవంత్రెడ్డి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. పొంగులేటి, జూపల్లి, కూచుకుంట్ల ఇలా చేరికల జాబితా పెంచేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డినీ లైన్లో పెట్టారు. గతంలో మాదిరి ఎన్నికల వేళ.. ఆ తర్వాత కూడా.. పార్టీ నేతలెవరూ చేజారకుండా ఎక్కడికక్కడ ఇష్యూస్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడైన జానారెడ్డి.. యాక్టివ్గా లేకపోవడం.. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుండటంతో.. ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేనే రంగంలోకి దిగారు.
ఉన్నట్టుండి థాక్రే.. జానారెడ్డి ఇంటికి వెళ్లారు. గంటకుపైగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఒకే కారులో బయటకు వెళ్లారు. థాక్రే, జానారెడ్డి భేటీ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై జానారెడ్డి.. తీవ్ర మనస్థాపం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ వాదులే తనను బద్నామ్ చేస్తున్నారేమోననే అనుమానమూ వ్యక్తం చేశారట జానారెడ్డి. అలాంటిదేమీ లేదని.. అంతా ఓ కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేద్దామని థాక్రే కోరారని సమాచారం. థాక్రే బుజ్జగింపులతో మెత్తపడిన జానారెడ్డి.. మళ్లీ పార్టీలో తన పెద్దరికాన్ని నిలుపుకునేలా.. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. త్వరలోనే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని టాక్. ఇలా ఎన్నికల వేళ.. కాంగ్రెస్లోని బాహుబలులంతా తిరిగి యాక్టివ్ అవుతుండటంతో.. హస్తం పార్టీలో మనుపటి సమరోత్సాహం కనిపిస్తోందని అంటున్నారు.