Khammam Congress Meeting(Latest political news telangana): ఖమ్మం.. తెలంగాణ జనగర్జనకు సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించబోతోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖమ్మం సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. జులై 2 న ఆదివారం నిర్వహించే ఈ సభను.. ఏకంగా వంద ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ హాజరుకానున్న ఈ సభకు.. తెలంగాణ జనగర్జన సభగా నామకరణం చేశారు. ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు.. ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అదే సమయంలో 100 రోజులకు పైగా నిర్వహించిన పీపుల్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా.. భట్టి విక్రమార్కను ఘనంగా సత్కరించనున్నారు. ఒకే వేదికపై రెండు భారీ కార్యక్రమాలు జరగనుండటంతో.. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇటు ఈ సభలో రాహుల్ గాంధీతో పాటు.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న వచ్చే ఎన్నికలకు ఈ సభను శంఖారావంగా భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్.. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలోనే రికార్డ్ సృష్టించేలా ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఏకంగా 4 నుంచి 5 లక్షల వరకు జనసమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఖమ్మం-వైరా రోడ్డులో ఎస్ఆర్ గార్డెన్ సమీపంలోని వంద ఎకరాల స్థలంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. వాహనాల పార్కింగ్ కోసం పక్కనే మరో 50 ఎకరాల స్థలాన్ని గుర్తించారు.
మరోవైపు ఖమ్మం సభపై కాంగ్రెస్ కన్ఫ్యూజన్ లో పడిందనే ప్రచారాన్ని కొట్టిపారేశారు.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాద్యులు మాణిక్ రావు ఠాక్రే. ఖమ్మంలో పర్యటించిన ఆయన.. భట్టి, పొంగులేటితో సమావేశం అయ్యారు. పొంగులేటి చేరికతోపాటు, భట్టి సన్మాన కార్యక్రమం ఒకే వేదికపై నిర్వహిస్తామన్నారు. భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సత్కరిస్తారని.. స్పష్టం చేశారు.