IT raid news today(Political news in telangana): బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ చేపట్టిన సోదాలు ముగిశాయి. ఈ నెల 14న ఉదయం 6 గంటల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో తనిఖీలు ముగిశాయని ప్రకటించారు.
ఐటీ దాడులపై భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని విమర్శించారు. BRS నేతలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మిగతా వ్యాపారాలతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తనకు విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలు లేవని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో మాత్రం వ్యాపార సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
తాను, తన భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని.. ఆ పైల్స్ ఐటీ అధికారులు తీసుకున్నారని పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. సక్రమంగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. తాను కొన్న ఆస్తుల వివరాలు తీసుకున్నారని వెల్లడించారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసి. .అందులో ఉన్న డాక్యుమెంట్ లపై వివరాలు అడిగారని వివరించారు . మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ లాకర్లు, బ్యాంకు లావాదేవీలపై ఐటీ అధికారులు వివరాలు సేకరించారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి వ్యాపార లావాదేవీలకు వారు చెల్లిస్తున్న పన్నులకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించారని సమాచారం.
పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్ , వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను ఐటీ శాఖ పరిశీలించిందని సమాచారం. తీర్థా గ్రూప్నకు డైరెక్టర్గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. వారి వద్ద నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు హైదరాబాద్, బెంగళూరులో వెంచర్లు, విల్లాల అమ్మకాలతో ద్వారా చేసిన నగదు లావాదేవీలను గుర్తించారని సమాచారం. వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు.