Rains: తెలంగాణలో 3రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం నుంచి గురువారం వరకు చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. మంగళవారం నిజామాబాద్ , కామారెడ్డి, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, నాగర్కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని పేర్కొంది.
బుధవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తాయని ప్రకటించింది. గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడకక్కడ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
మరోవైపు తెలంగాణలోని 9 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక పంపింది. ఆయా జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో జూన్లో సగటు వర్షపాతంతో పోల్చితే 60 శాతం నుంచి 77 శాతం తక్కువగా కురిసిందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఈ వానాకాల సీజన్లో పంటలకు నీటి కొరత ఏర్పడే ప్రమాదముందని వ్యవసాయశాఖ పేర్కొంది.