Harish Rao Latest News : తెలంగాణలో మరో 8 నెలల లోపే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇప్పటి నుంచే పార్టీలన్నీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అన్నివర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. తాజాగా తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.
సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి హరీశ్ రావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులకు కీలక సూచన చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే తెలంగాణలో ఓటు నమోదు చేయించుకోవాలని హరీశ్రావు ఆంధ్రా కార్మికులకు పిలుపు నిచ్చారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎకరా విస్తీర్ణంలో రూ.2 కోట్ల వ్యయంతో కార్మిక భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మేడే రోజు శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా భవన నిర్మాణ కార్మిక మండలిలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఇలా ఆంధ్ర కార్మికులకు హరీశ్ రావు భరోసా కల్పించారు. అలాగే ఏపీలో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని అన్నారు. అందుకే ఏపీలో ఓటు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని వారికి సూచించారు.
హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు వెనుక రాజకీయం కోణం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వాస్తవానికి తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ లోపు జరుగుతాయి. అలాగే ఏపీ ఎన్నికలు ఏప్రిల్ లో జరగాలి. కానీ ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే టాక్ వినిపిస్తోంది. అది కూడా తెలంగాణ ఎన్నికలతోపాటే జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ వారు స్వరాష్ట్రాల్లో ఓటు హక్కు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో అక్కడికే వెళ్లి ఓట్లు వేస్తున్నారు. ఇందుకు రాజకీయ పార్టీలు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హరీశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఒకవేళ ఇరు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఆంధ్ర కార్మికుల ఓట్లు బీఆర్ఎస్ కే పడతాయని హరీశ్ రావు నమ్మకంగా ఉన్నారా..? అందుకే ఇక్కడే ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారా..?
ఇక, ఏపీ కంటే తెలంగాణ బెటర్ అన్న హరీశ్రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు ఒకసారి ఏపీలోకి వచ్చి చూస్తే తమ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపిస్తుందన్నారు.
కారుమూరి కామెంట్స్పై మంత్రి హరీశ్ రావు తిరిగి స్పందించారు. తాను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు.. ఇప్పుడేమో అడగరు. విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు. అధికారంలా ఉన్న వాళ్ళు అడగరు.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరంటూ మండిపడ్డారు హరీశ్ రావు.