Farmers protest news telangana(TS news updates): తెలంగాణలో రైతుల చేతులకు మరోసారి సంకెళ్లు పడ్డాయి. ఆనాడు ఖమ్మం.. ఇప్పుడు భువనగిరి. ఆ రైతులు చేసిన తప్పేమీ లేదు. తమ భూములు ప్రభుత్వానికి ఇవ్వమన్నందుకు.. మంత్రి జగదీష్రెడ్డిని అడ్డుకున్నందుకు.. ఆ రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. తాజాగా కోర్టుకు తీసుకెళ్లే సమయంలో.. ఇద్దరు రైతుల చేతులకు బేడీలు వేసి తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు ఖాకీలు.
వాళ్లేమైనా ఉగ్రవాదులా? నేరగాళ్లా? హత్యలు చేశారా? దోపిడీలు చేశారా? తమ భూములు దోపిడీ కాకుండా ఆందోళన చేయడమే ఆ అన్నదాతలు చేసిన నేరమా? యాదాద్రి జిల్లా రాయగిరి ఆర్ఆర్ఆర్ రైతులకు పోలీసులు సంకెళ్లు వేసిన ఘటన సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే…
మే 30న ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు రైతులు. అక్కడకు వచ్చిన మంత్రి జగదీష్రెడ్డిని అడ్డుకోవడంతో.. ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు పోలీసులు. నలుగురిని అరెస్ట్ చేసి.. అదే రోజు రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు రైతులు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.
తమ అరెస్టుపై ఆ రైతులు కోర్టుకు వెళ్లడంతో వారికి బెయిల్ మంజూరైంది. అటు, 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ సైతం ముగిసింది. దీంతో ఆ నలుగురు రైతులను భువనగిరి కోర్టుకు తీసుకొచ్చే సమయంలో వాళ్లకు సంకెళ్లు వేయడం వివాదాస్పదంగా మారింది. పోలీసుల తీరుపై అన్నివర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీస్తున్నారు.