Latest news in Telangana: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో గుప్త నిధుల కలకలం రేపింది. దేవతల గుట్టపై వెలసిన భైరవుని విగ్రహాన్ని దొంగలించేందుకు యత్నించి విఫలమయ్యారు దుండగులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దేవతల గుట్టపైకి రాత్రి సమయాల్లో దేవతలు వచ్చి వెళ్తుంటారని స్థానికుల విశ్వాసం. గుట్టపైకి ఎవరైనా వెళితే తిరిగిరారని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారంలో ఉండటంతో ఇంతకాలం ఈ గుట్టపైకి ఎవరు వెళ్లే సాహసం చేయలేదు. దీన్నే అదునుగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు భైరవుడి విగ్రహాన్ని దొంగలించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అక్కడ గుప్తనిధులు ఉన్నాయని తవ్వే ప్రయత్నం చేశారు.
సుమారు 8 అడుగులు ఉండే బరువైన విగ్రహాన్ని కదిలించే ప్రయత్నం చేశారు. 3వేల సంవత్సరాల క్రితం నాటి ఆనవాళ్లు కలిగిన ఈ గుట్టపై గుప్త నిధులు ఉన్నాయని భావించిన దుండగులు తవ్వకాలను మొదలుపెట్టి విఫలమయ్యారు. కాకతీయుల కాలం నాటి తమ గ్రామ చరిత్రను నాశనం చేసేందుకు ప్రయత్నించిన దుండగులను వెంటనే శిక్షించాలని పోలీసులను గ్రామస్తులు కోరుతున్నారు.