Telangana news updates: సీఎం కేసీఆర్ పాలనపై అనేక విమర్శలు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత. కానీ, కొన్ని విషయాల్లో మాత్రం సీఎంగా కేసీఆర్ తన మార్క్ ప్రదర్శించారు. తెలంగాణ చరిత్రలో తన పేరు శాశ్వతంగా నిలిచి ఉండేలా.. పలు ఘనమైన కట్టడాలు కట్టించారు. అవసరం లేకున్నా.. ఎవరూ అడగకున్నా.. ప్రజాధనం వృధా చేశారనే విమర్శలు ఉన్నా.. ఆ నిర్మాణాలకు తాజాగా అంతర్జాతీయ స్థాయి అవార్డులు రావడం విశేషం.
లండన్కు చెందిన ‘గ్రీన్ ఆర్గనైజేషన్’ తెలంగాణలోని 5 కట్టడాలకు అవార్డులు ప్రకటించింది. ‘ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్’ పేరుతో ఈ అవార్డులు వెల్లడించింది.
అవార్డులు వచ్చిన నిర్మాణాలు:
–బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ బిల్డింగ్
–యాదాద్రి ఆలయం
–ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
–దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
–మొజంజాహి మార్కెట్
ఈ నెల 16న లండన్లో గ్రీన్ ఆర్గనైజేషన్ అవార్డులను అందజేయనున్నారు. ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఈ అవార్డులను అందుకోనున్నారు. తెలంగాణ కట్టడాలకు 5 అంతర్జాతీయ అవార్డులు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.
మరోవైపు, ఇంతకు ముందెప్పుడూ వినని ‘గ్రీన్ ఆర్గనైజేషన్’ గురించి ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఏరికోరి.. ఒకేసారి.. తెలంగాణలోని 5 నిర్మాణాలకు.. ఒకే సంస్థ ఇన్నేసి అవార్డులు ఇవ్వడంపై ఆశ్చర్యంతో పాటు అనుమానమూ వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.