Etela rajender news today in telugu(Political news in telangana): ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లొచ్చారు. హైకమాండ్ బుజ్జగించి పంపించింది. హస్తిన వెళ్లొచ్చిన నుంచి ఈటల రాజేందర్ సైలెంట్గానే ఉండిపోయారు. ఢిల్లీ టాక్స్ గురించి నోరు విప్పలేదు. ఇంతకీ ఏం జరిగింది? పెద్దలు ఏం చెప్పారు? ఈయన వాళ్లకేం చెప్పారు? ఈటల లేటెస్ట్ రియాక్షన్ ఏంటి?
ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతున్నారని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్తో ఆధిపత్యపోరు నడుస్తోంది. ఈటల సొంతంగా పాలిటిక్స్ చేస్తున్నారనే ఆరోపణ ఉంది. అధిష్టానానికి చెప్పే చేస్తున్నాననేది ఆయన ఆన్సర్. తన కుర్చీకే ఎసరు పెట్టారనేది బండి డౌట్. ఏకంగా ఈటలనే ముఖ్యమంత్రి కేండిడేట్గా ప్రకటిస్తారంటూ ప్రచారం మరోవైపు. ఇలా బీజేపీలో మునుపెన్నడూ లేనంత లుకలుకలు. కర్నాటక ఫలితాల తర్వాత కాషాయ ప్రాభవం మరింత పతనమైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ రేసుగుర్రంలా దూసుకుపోతోంది. ఈటల రాజేందర్ను హస్తం గూటికి రారమ్మంటూ బహిరంగంగానే ఆహ్వానాలు అందుతున్నాయి. ఏటూ తేల్చుకోలేని సందిగ్థ అవస్థలో ఉండిపోయారు ఈటల. ఈ విషయం గుర్తించిన బీజేపీ హైకమాండ్ రాజేందర్తో పాటు అదే దారిలో ఉన్న రాజగోపాల్రెడ్డిని ఢిల్లీకి పిలిపించి.. చెప్పాల్సిది చెప్పి పంపించింది. వీళ్లిద్దరు సైతం ఢిల్లీ పెద్దలకు చెప్పాల్సింది చెప్పేసి.. తిరిగొచ్చేశారు. వాట్ నెక్ట్స్? అనేదే ఇప్పుడు ఆసక్తికరం.
ఇలాంటి సమయంలో మంగళవారం ఈటల దంపతుల ప్రెస్ మీట్ అనే సమాచారంతో.. అంతా ఆయన బీజేపీని వీడి.. కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరిగింది. తీరా మంగళవారం వచ్చేసరికి.. ఆ దంపతులిద్దరు వేరు వేరుగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈటల జమున మీడియా ముందుకు వచ్చి.. తన భర్త హత్యకు కుట్ర చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డిపై ఆరోపణలు చేశారు. అటు, ఈటల రాజేందర్ వేరుగా వేరే ప్రెస్ మీట్ పెట్టారు. ధరణితో కేసీఆర్ చేస్తున్న దోపిడీ గురించి విమర్శలు చేశారు. అంతేనా? ఇంకేం లేదా? పార్టీ మారుతున్నారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. అప్పుడు ఏదో సింపుల్గా తాను చెప్పాల్సింది చెప్పారు.
పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత సులువు కాదన్నారు ఈటల రాజేందర్. బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిస్తే వెళ్లాను తప్ప.. ఎవరి మీద కంప్లైంట్లు చేయడానికి కాదన్నారు. ప్రాంతీయ పార్టీలకు హైదరాబాద్ హెడ్క్వార్టర్స్ ఎలాగో.. జాతీయ పార్టీలకు ఢిల్లీ అలాంటిదన్నారు ఈటల. ఇంతే. ఇంకేం లేదు. పార్టీ మారడం లేదు. బండితో విభేదాలను ప్రస్తావించలేదు. జస్ట్ మ.మ అనిపించారంతే.