Deputy CM Bhatti Vikramarka Comments: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్ రాసిన లేఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి కోరిక మేరకే కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. జగదీశ్వర్ రెడ్డి ఒకలా, కేసీఆర్ మరోలా మాట్లాడుతున్నారన్నారు. కమిషన్ ముందు హాజరయితే కేసీఆర్ కు వచ్చే నష్టమేమిటంటూ ఆయన ప్రశ్నించారు. గతంలో ఇందిరాగాంధీ కూడా కమిషన్ ముందు హాజరయ్యారంటూ భట్టి విక్రమార్క గుర్తుచేశారు.
ఇదిలా ఉంటే.. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, అదేవిధంగా యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలోనూ వివరణ ఇవ్వాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు పంపింది. ఈ నోటీసులు తీసుకున్న కేసీఆర్.. కమిషన్ కు తిరిగి 12 పేజీలతో కూడిన లేఖను పంపించారు. రాజకీయ దురుద్దేశపూర్వకంగానే విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశారంటూ ఆయన అందులో పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామంటూ ఆయన అందులో పేర్కొన్నారు. ప్రజలకు 24 గంటల నిరంతర విద్యుత్ ను అందజేశామన్నారు. ఎంక్వైయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలంటూ జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ అందులో సూచించడం గమనార్హం. అదేవిధంగా విచారణ నిష్పక్షపాతంగా జరగడంలేదంటూ కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Also Read: రేపు బక్రీద్.. హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..?
ఇటు కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కూడా స్పందించారు. కేసీఆర్ చెప్పిన అంశాలపై తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. అందుకు సంబంధించి నిపుణులతో కూడిన కమిటీతో చర్చిస్తామన్నారు. కేసీఆర్ చెప్పిన వివరాలను వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామని తెలిపారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునపరిశీలిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఎల్లుండి సమీక్ష జరుపుతాం.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామంటూ ఆయన పేర్కొన్నారు.