Telangana MLC Bypoll Counting(Telangana news live): తెలంగాణలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజేత ఎవరు? పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఇవే ప్రశ్నలు రాజకీయ నేతలను వెంటాడుతోంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ బరిలో నిలిచారు. పట్టభద్రులు ఎవరివైపు మొగ్గుచూపారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజాగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలైంది. ఈసారి బరిలో 56 మంది అభ్యర్థులున్నారు. 4 లక్షల 63 వేల ఓట్లకుగాను, 3 లక్షల 36 వేల ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపు 72 శాతం ఓటింగ్ జరిగిందన్నమాట.
బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించడంతో లెక్కింపు ప్రక్రియ సుదీర్థంగా సాగనుంది. ఫలితం అర్థరాత్రి తర్వాత వెలువడే ఛాన్స్ ఉందని అంటున్నారు. చెల్లుబాటు అయిన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినవారే విజేత అవుతారు.
ALSO READ: కారుకి షాకిచ్చిన ఫలితాలు, కేవలం రెండు సీట్లలో…
ఫలితం తేలకుంటే చివరివరకు ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే రెండురోజుల వరకు కౌంటింగ్ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లారాజేశ్వర్రెడ్డి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో పల్లాకు గట్టి పోటీ ఇచ్చారు తీన్మార్ మల్లన్న. కానీ, ఈసారి గెలుపు ఖాయమని మల్లన్న మద్దతుదారులు అంటున్నారు.