Jithender Reddy Tweet(BJP news telangana) : తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. కీలక నేతలు వర్గాలుగా విడిపోయారు. కొంత మంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మద్దతుగా ఉన్నారు. మరికొందరు ఈటల రాజేందర్ కు సపోర్టు చేస్తున్నారు. ఇక ఇంకొందరు సొంత అజెండాతో ముందుకెళుతున్నారు. ఇలా బీజేపీలో వర్గపోరు నడుస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పెను దుమారాన్ని రేపింది.
దున్నపోతును తన్ని ట్రక్లోకి ఎక్కిస్తున్న వీడియోను జితేందర్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులకు కూడా ఇలాంటి ట్రీట్ మెంట్ అవసరమని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్, బీజేపీ పార్టీకి ఈ వీడియోను ట్యాగ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ పెను దుమారాన్ని రేపింది. ఆ వీడియోపైనే చర్చ జరుగుతోంది.
కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జితేందర్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా పాల్గొనడంలేదు. కొంతకాలంగా ఆయన వాయిస్ కూడా వినిపించడంలేదు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ఆయన సడెన్ గా వివాదాస్పద ట్వీట్ చేసి పార్టీలో అగ్గిరాజేశారు. మరి జితేందర్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియోపై తెలంగాణ బీజేపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
మరోవైపు బీజేపీకి చాలా మంది నేతలు షాకిచ్చే యోచనలో ఉన్నారు. కొందరు కీలక నేతలు పార్టీని వీడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ జాబితాలో ప్రధానంగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం వారిని ఢిల్లీకి పిలిచి బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. మరి జితేందర్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? అందుకే ఈ ట్వీట్ చేశారా? ఆయన కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారా..? ఈ అంశాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.