Congress News Updates: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఒకేసారి 2 లక్షల వరకు రైతురుణ మాఫీ చేస్తాం.. ఇలా సాగుతోంది పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హామీల ప్రవాహం. హామీలు ఆసక్తికరంగా ఉండటంతో.. జనాలు సైతం కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇంకా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండగానే తెలంగాణ కాంగ్రెస్ ఇంతలా హామీలు గుప్పిస్తుంటే.. ఇప్పటికే ఎలక్షన్ నగారా మోగిన కర్నాటకలో ఇంకెంతగా హామీలు ఇవ్వాలి? అదే చేస్తోంది కన్నడ కాంగ్రెస్. పలు ఆసక్తికర పథకాలు ప్రకటిస్తోంది. ఉచిత కరెంటు, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి.. వాటిలో ఈ నాలుగు ప్రధాన హామీలు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘గృహజ్యోతి’ పథకం తీసుకొస్తామని ప్రకటించింది. పేద, మధ్య తరగతి వర్గాలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది.
ఇక, మహిళల కోసం ‘గృహలక్ష్మి’ పథకం తీసుకొస్తామని చెబుతోంది. ప్రతీ కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతినెల రూ.2వేలు అందజేస్తామని అంటోంది.
ఉచిత బియ్యం పథకం కూడా ప్రకటించింది కర్నాటక కాంగ్రెస్. ‘అన్న భాగ్య యోజన’ పేరుతో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని తెలిపింది.
ఇక కీలకమైన మరో హామీ ‘యువనిధి’. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భత్యం ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశం. డిగ్రీ పూర్తిచేసి నిరుద్యోగులుగా ఉన్నవారికి నెలకు రూ.3వేలు.. డిప్లొమా కంప్లీట్ చేసినవారికి నెలకు రూ.1500 అందిస్తామని ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చాక.. వరుసగా రెండేళ్ల పాటు మాత్రమే నిరుద్యోగులకు భృతి కల్పించేలా ‘యువనిధి’ పథకం అమలు చేస్తామని ముందే వెల్లడించింది.
ఈ నాలుగే కాకుండా ఇంకా చాలానే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని.. అమన్నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చెబుతున్నారు హస్తం నేతలు. మరి, ఈ హామీలు ఏ మేరకు ఓట్లుగా మారుతాయో? కాంగ్రెస్ను ఈసారైనా గట్టెక్కిస్తాయో? చూడాలి.