Karnataka: కాంగ్రెస్కైనా, బీజేపీకైనా.. దక్షిణాదిన కాస్త కష్టపడితే గెలిచే రాష్ట్రం కర్నాటకే. అందుకే, ఆ రాష్ట్ర ఎన్నికలపై జాతీయ స్థాయి ఫోకస్ ఉంది. ఈసీ సైరన్ మోగినప్పటి నుంచీ.. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్లు హోరాహోరీ ప్రచారాలు, వ్యూహాలు అమలు చేస్తున్నాయి. బీజేపీకి అనేక ఎదురుదెబ్బలూ తగులుతున్నాయి. కాషాయదళం నుంచి హస్తం గూటికి వలసలు పెరుగుతున్నాయి. గెలుస్తుందనే టాక్ ఉన్న పార్టీలోకే జంపింగ్స్ ఉంటాయి కాబట్టి.. ఆ లెక్కన ఈసారి కర్నాటకలో కాంగ్రెస్కే విజయావకాశాలు ఎక్కువనే ప్రచారం జరుగుతోంది.
కేవలం ప్రచారం మాత్రమే కాదు.. ప్రీ పోల్ సర్వేలు సైతం చేతికే జై కొడుతున్నాయి. లేటెస్ట్గా హైదరాబాద్ బేస్డ్.. పీపుల్స్ పల్స్ సంస్థ.. సౌత్ ఫస్ట్తో కలిసి చేసిన సర్వేలో కాంగ్రెసే గెలుపు గుర్రమని తేలింది. డీకే శివకుమార్ నాయకత్వంలో హస్తం పార్టీ యమ దూకుడు మీదుంది మరి. అందుకే, కర్నాటకతో దక్షిణాదిన కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలవుతుందని.. నెక్ట్స్ గెలిచేది తెలంగాణలోనేనని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సైతం ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు.
అయితే, పీపుల్స్ పల్స్ సర్వేలో ఓ ట్విస్ట్ కూడా ఉంది. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా.. కావలసినంత మెజార్టీ మాత్రం రాకపోవచ్చని తేలింది. కర్నాటకలో హంగ్ తప్పకపోవచ్చనే సంకేతాలు ఇచ్చింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్కు 95 నుంచి 105 మధ్య సీట్లు వస్తాయని అంచనా. బీజేపీ సైతం పోటాపోటీ సీట్లు దక్కించుకోనుందని.. కమలం పార్టీకి 90 నుంచి 100 లోపు స్థానాల్లో గెలుస్తుందని సర్వేలో తేలింది. ఇక, జేడీఎస్ 25-30 సీట్లతో మూడో స్థానానికే పరిమితం కానుంది. అయితే, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే.. జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కర్నాటక అసెంబ్లీలో మేజిక్ ఫిగర్-113.
మాజీ మంత్రి గాలి జనార్థన్రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష-కేఆర్పీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎంలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 41 శాతం ఓటు షేరింగ్ వస్తుందని.. బీజేపీకి 36 శాతం, జేడీఎస్ 16 శాతం ఉంటుందని సర్వేను బట్టి తెలుస్తోంది. ఎప్పటిలానే ఈసారి కూడా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ పట్టు స్పష్టంగా కనబడుతోంది. రూరల్లో మాత్రం కాంగ్రెస్ దూసుకుపోతుందని తాజా సర్వేలో తేలింది.
ఇక, ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్య వైపే ఓటర్లు ఆసక్తిగా ఉన్నారని సర్వేలో స్పష్టమైంది. 32 శాతం మంది సిద్ధరామయ్యను సీఎంగా ఎంచుకోగా.. బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పను సీఎంగా 25 శాతం మంది అంగీకరించారు. ప్రస్తుత సీఎం బసవరాజు బొమ్మైకి 20 శాతం మంది మద్దతు తెలిపారు. జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామికి 18 శాతం మంది జై కొట్టారు. సీఎం బొమ్మై పాలన బాగుందని 17 శాతం మంది అభిప్రాయపడితే.. బాగోలేదని 48 శాతం అన్నారు.
మరి, కర్నాటకలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటే.. రేవంత్రెడ్డి అన్నట్టు తెలంగాణలోనూ పవర్లోకి వచ్చేనా? కర్నాటక ఇంపాక్ట్ తెలంగాణలో పని చేస్తుందా?