CM Revanthreddy Chit chat: తెలంగాణ ఇప్పటివరకు రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు కాలేదన్నా రు సీఎం రేవంత్రెడ్డి. గతంలో పక్క రాష్ట్రాల్లో జరిగినట్టు తమ పాలన ఉండదన్నారు. గడిచిన రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పని చేస్తే, ఈసారి కేసీఆర్ వ్యతిరేక గాలి పని చేసిందన్నారు. ఢిల్లీలో మీడియా మిత్రులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సమస్యలు, సంబంధాలు, రాజకీయ నేతల వ్యవహారశైలిపై మనసులోని మాట బయటపెట్టారు.
ప్రజలు మనకు అధికారం ఇచ్చింది పగ తీర్చుకోవడానికి కాదన్నారు సీఎం. ఈ విషయంలో జగన్ను చూసి నేర్చుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్ను నమ్మి 151 సీట్లు ఇచ్చారని, ఆయన తప్పు చేయడంతో ఇప్పుడు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలనుకున్నారని, ఇప్పుడు ఆయన తుడిచిపెట్టుకుపోయారన్నారు. తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేసే పరిస్థితి ఉంటే వాళ్లకు 10 శాతం ఓట్లు వచ్చేవని, అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలీదన్నారు.
మనం చేసిన పాపాలు మనల్ని మింగుతాయని చెప్పడానికి జగన్ ఒక ఎగ్జాంఫుల్గా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్రెడ్డి. ఏపీలో పరిశ్రమలు కుప్పకూలాయని, ఆ రాష్ట్రం దెబ్బ తిన్నదన్నారు. సీఎం చంద్రబాబు తనకు ఫోన్ చేస్తే హైదరాబాద్లో జగన్ ఇంటి వద్ద అక్రమ కూల్చివేతలకు పాల్పడ్డారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబు అలాంటి పనులు చేయలేదని, అలా దిగజారే వ్యక్తిత్వం లేదన్నారు.
కేసీఆర్ తన ఫామ్హౌస్ ముందు ఏవేవో కట్టుకున్నారని, అవేం మా ప్రభుత్వం తొలగించలేదన్నారు. నా ప్రధాన ప్రత్యర్థి మీద తాను ఇలాంటివి చేయనప్పుడు జగన్ విషయంలో ఎందుకు చేస్తానని అన్నారు. చంద్రబాబునాయుడు ముందు జగన్ ఎంత? అయినా ప్రతిపక్ష నేతగా పని చేశారని గుర్తు చేశారు సీఎం రేవంత్. వాళ్లు తిట్టే తిట్లు తట్టుకుని పోరాడారు. ఇక్కడ కేసీఆర్ను ఆ పని చేయలేదన్నారు. కేసీఆర్ పార్టీని నిలబెట్టుకునే పరిస్థితిలో లేరన్నారు. ఇవాళ భావోద్వేగాలు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నాయని, అందువల్ల హేతుబద్దంగా ప్రవర్తిస్తే బీఆర్ఎస్ బతుకుతుందన్నారు.
బీఆర్ఎస్ క్లోజ్ అవ్వాలనుకున్న వ్యక్తుల్లో మొదట, చివర హరీష్రావు ఉంటారన్నారు ముఖ్యమంత్రి. ఈటల, నరేంద్ర, విజయశాంతిలను బయటకు పంపించిందే ఆయనేనని గుర్తు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే మాట్లాడేది హరీషేనని, అందుకే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్ తనకు ముఖ్యమని క్లారిటీ ఇచ్చేశారాయన.
ALSO READ: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకతో.. కాంగ్రెస్ లో చేరికలకు లైన్ క్లియర్
సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడనన్నా రు తెలంగాణ సీఎం. నా ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి వచ్చేశానని, ఇప్పుడు ఆయన కోసం ఆ ఉద్యోగం వదలుకుంటానా అని అన్నారు. చంద్రబాబు చెప్పారని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తే ప్రజలు నన్నెందుకు రాజకీయాల్లో ఉంచుతారని మనసులోని మాటను బయటపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.