CM Revanth Reddy: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగా అంటూ ఆయన పేర్కొన్నారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైనటువంటి ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు రేపు ఈ పండుగ జరుపుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రవక్తల అచంచలమైన భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: కమిషన్ ముందు హాజరయితే కేసీఆర్కు వచ్చే నష్టమేమిటి..? : భట్టి
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. తమకు ఉన్నదాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం ఇంకోటి లేదనే స్ఫూర్తిని చాటిచెబుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.