Today KCR meeting updates(Political news in telangana): మహేశ్వరం నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. మెట్రో రైలు ప్రాజెక్టును మహేశ్వరంలోని కందుకూరు వరకు పొడిగించే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తామన్నారు. తుమ్ములూరికి రూ.కోటితో కమిటీ హాల్ మంజూరు చేస్తున్నామన్నారు. దానికి దశాబ్ది కమ్యూనిటీ హాల్ అని నామకరణం చేశారు సీఎం కేసీఆర్.
మహేశ్వరం నియోజకవర్గంలోని 65 గ్రామపంచాయతీలకు 15లక్షల చొప్పున స్పెషల్ ఫండ్.. జల్పల్లి, తుక్కుగూడకు 25 కోట్లు.. బడంగ్పేట్, మీర్పేట్కు 50 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి.
సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ.. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజలకు తాగు, సాగునీరు ఇస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. త్వరలోనే ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలో నీటికష్టాలు తీరిపోతాయన్నారు. వరి ఉత్పత్తిలో మనల్ని ఎక్కిరించినవారు ఏడో స్థానానికి పడిపోయారంటూ పరోక్షంగా ఏపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుమ్మలూరులో హరితోత్సవ సభకు హాజరయ్యారు సీఎం కేసీఆర్. ఏడారిగా ఉండే తెలంగాణ ఇప్పుడు పచ్చబడిందన్నారు. ఇదంతా హరితహారం కార్యక్రమంతోనే సాధ్యమైందని.. గతంలో దీన్ని మొదలుపెట్టే ముందు అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు అవహేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం 276 కోట్ల మొక్కలు రాష్ట్రంలో ఇప్పటికే నాటామని.. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో అర్బన్ పార్క్లు రూపుదిద్దుకున్నాయని తెలిపారు. 100 కోట్లతో ఈ ఏడాది నుంచి ఉచితంగా ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు సీఎం కేసీఆర్.