Vishaka Steel Plant News(TS & AP News): తెలుగు రాష్ట్రాల రాజకీయం విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టే తిరుగుతోంది. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజామాన్యం చేసిన ప్రతిపాదనకు.. బయట జరుగుతున్న ప్రచారానికి సంబంధమే లేదు. ముడిపదార్థాలు లేదా మూలధనం ఇచ్చేవారికి.. బదులుగా స్టీల్ ఇవ్వనున్నారు. ఇంతే విషయం. కానీ, స్టీల్ ప్లాంటే అమ్మేస్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వం సింగరేణితో కొనుగోలు చేయిస్తుందని బయట ప్రచారం జరుగుతోంది. అసలు EOI అంటే ఏంటో కూడా చాలా మందికి అర్థం కావడం లేదు.
ఇటీవల విశాఖ ఉక్కు యాజమాన్యం EOI ప్రకటన జారీ చేసింది. ఆనాటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్రంగానే రెండు రాష్ట్రాల రాజకీయాలు రన్ అవుతున్నాయి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రభుత్వం అమ్మేయడానికి యత్నిస్తుంటే దానిని అడ్డుకోవడానికి కేసీఆర్ సింగరేణి డైరెక్టర్లతో బిడ్ వేయిస్తున్నారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకు, ప్రైవేటీకరణకు సంబంధం లేదు. ఇది కేవలం ముడిపదార్థాల సరఫరా లేదా వర్కింగ్ క్యాపిటల్ను సమకూర్చితే దానికి సమానమైన విలువగల స్టీల్ ఇస్తాం అంటోంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రండి అని ఈవోఐ ప్రకటన జారీ చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్లాస్ట్ ఫర్నేస్-3 గత సంవత్సరం కాలం నుంచి మూతపడి ఉంది. ముడి పదార్థాలకు, ప్రారంభించడానికి అవసరమైన నిధులు లేకపోవడంతో దానిని మూసేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. స్టీల్ ప్లాంట్ లో మిగిలిన రెండు బ్లాస్ట్ ఫర్నిచర్ యూనిట్లు నడిపేందుకు కూడా అవసరమైన ముడిపదార్థాలూ సమీకరించలేని పరిస్థితి ఉంది. అన్ని దారులూ మూసుకుపోవడంతో విశాఖ ఉక్కు యాజమాన్యం కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. ఎవరైనా ముడి పదార్థాలు సరఫరా చేస్తే.. దానికి బదులుగా తయారు చేసిన స్టీల్ని ఇస్తాం అంటూ గత నెలలో ఈవోఐ జారీ చేసింది.
దేశంలో ఏ ఉక్కు పరిశ్రమ ఈ తరహా ప్రయోగం చేయలేదు. కేంద్రం ప్రభుత్వం నుంచి ఏ రకంగానూ సాయం అందకపోవడంతో అవసరమైన వనరులను సొంతంగా సమకూర్చుకునే క్రమంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ప్లాంటు మూతపడకుండా ఏదో విధంగా నడపాలనే ఉద్దేశంతో ఇచ్చిన ప్రకటన కావడంతో ఉద్యోగ, కార్మిక సంఘాలు కూడా అయిష్టంగానైనా సహకరిస్తున్నాయి.
ఉక్కు తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల రంగంలో ఉన్న కంపెనీలు మాత్రమే ఈవోఐకి స్పందించి ముందుకురావాలని ప్రకటనలో స్పష్టంగా చెప్పారు. దీనిపై ఏప్రిల్ 15వ తేదీలోపు స్పందించాలని కోరారు. స్టీల్ తయారీకి ఐరన్ ఓర్, కోకింగ్ కోల్, ఫెర్రో ఎల్లాయిస్, డోలమైట్, లైమ్స్టోన్, మాంగనీస్, ఆక్సిజన్ కీలకమైన ముడి పదార్థాలు. అయితే సింగరేణి కాలరీస్ లో లభించే బొగ్గు కోకింగ్ కోల్, బీఎఫ్ కోల్ కాదు. కేవలం బాయిలర్ కోల్ అంటే థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లలోని బాయిలర్లలో ఉపయోగిస్తారు. ఒకవేళ ముడి పదార్థాల సరఫరాకు సింగరేణి ఎంపికైతే ఆ సంస్థ సరఫరా చేసే బొగ్గును విశాఖ స్టీల్ప్లాంట్లోని థర్మల్ ప్లాంటులో ఉపయోగించవచ్చు. దీంతో నెలకు 50 కోట్ల వరకు ఆదా అవుతుంది. ఇతరత్రా ముడిపదార్థాలను సింగరేణి నేరుగా సరఫరా చేసే పరిస్థితి లేదు. ఇక ఈవోఐ నిబంధనల ప్రకారం నేరుగా వర్కింగ్ క్యాపిటల్ను కూడా అందించే అవకాశముంది. ఇందుకు దాదాపుగా 5 వేల కోట్లు అవసరం. సింగరేణి సంస్థ ఆ స్థాయి నిధులను సమకూర్చగలదా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రకటించారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవను తప్పకుండా స్వాగతిస్తున్నామని.. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. కలిసివచ్చే వారితో పోరాటం కొనసాగుతోందని చెప్పారు.
అటు, స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదన్నారు. కొత్త విభాగాల ప్రారంభోత్సవం కోసం ముడిసరుకు పెంచుకునే దశలో ఉన్నట్టు చెప్పారు.
అయితే స్టీల్ ప్లాంట్ లోకి బయటిసంస్థలు ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో.. అప్పుడే ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైందనే భావించాలి. కానీ ఇప్పుడికిప్పుడు ప్రైవేటు పరం చేయాలని అనుకోవడం లేదని కేంద్ర మంత్రి చెబుతుంటే.. భవిష్యత్ లోనైనా తప్పదని హింట్ ఇచ్చారా? అనే అనుమానాలూ వస్తున్నాయి.