Vishaka Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. రెండేళ్లుగా నలుగుతోంది. కార్మికులు, ఉద్యోగులు ఉద్యమించినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. సీఎం జగన్ కేంద్రానికి పలుమార్లు మొరపెట్టుకున్నా వినలేదు. టీడీపీ గొంతెత్తినా ఆలకించలేదు. జనసేన ఫ్రెండ్లీ రిక్వెస్ట్ స్వీకరించలేదు. ఇలా ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ విశాఖ ఉక్కు ఇష్యూను రాజకీయంగా బాగానే వాడేసుకున్నాయి. లేటెస్ట్గా ఏపీలో ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనే మెయిన్ ఎజెండాగా మార్చుకుంది. ఎలాగూ మోదీ-బీజేపీపై దండయాత్ర చేస్తున్న గులాబీ బాస్.. వారిపైకి విశాఖ ఉక్కును ఆయుధంగా ఎక్కుపెట్టారు. మంత్రి కేటీఆర్ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలుమార్లు గళమెత్తారు. కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు. ఈవోఐ ప్రకటనకు సింగరేణి ద్వారా రెస్పాండ్ అయ్యారు. ఇలా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కాస్త హడావుడి అయితే చేసింది.
కట్ చేస్తే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలని భావించడంలేదంటూ తాజాగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్సింగ్ కులస్తే ప్రకటించడం రాజకీయ రగడకు కారణమైంది. కేంద్ర మంత్రి ఇలా స్టేట్మెంట్ ఇచ్చారో లేదో.. అలా తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసేసుకున్నారు. ‘‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపైన గట్టిగా మాట్లాడింది మన సీఎం కేసీఆరే. తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటది’’ అని కేటీఆర్ అన్నారు. అటు, హరీశ్రావు సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చిందని.. ఏపీలోని రెండు పార్టీలో నోరు మూసుకుంటే.. బీఆర్ఎస్ మాత్రం గట్టిగా కొట్లాడిందని హరీశ్ అన్నారు.
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గడాన్ని బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకోవడంపై వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. వెంటనే మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మాటలు ఉట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగిరింది అన్నట్టు ఉందని సెటైర్లు వేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వీళ్లను చూసి కేంద్రం తగ్గిందా? మరి, తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణపై ఎందుకు తగ్గటం లేదు? అంటూ పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఇదీ పాయింటే.
సింగరేణి ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ కొట్లాడుతున్నట్టు చేస్తుండటం.. కేంద్రం మాత్రం తన పని తాను చేసుకుపోతున్నట్టు ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. అదే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ రెండు విమర్శలు చేసినంత మాత్రాన కేంద్రం భయపడి వెనక్కి తగ్గిందని అనడంలో ఎక్కడో లాజిక్ మిస్ అవుతోందని అంటున్నారు. కేవలం కేసీఆర్ ఓ కామెంట్ చేసినంత మాత్రాన ప్రైవేటీకరణ ఆగిపోయిందా? బీఆర్ఎస్ నేతలు ఇంతలా అది మా గొప్పే అంటూ ఊదరగొడుతుండటం పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం కాక ఇంకేంటి? అనేది వైసీపీ ప్రశ్న. అట్లుంటది మరి కేసీఆర్ రాజకీయం.