Hyderabad: చిన్న నిర్లక్ష్యం. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రెండేళ్ల చిన్నారిని చంపేసింది. అప్పటి వరకూ ఆనందంగా ఉందా కుటుంబం. భార్య, భర్త, కూతురు. ముగ్గురూ కలిసి బండి మీద వెళ్తున్నారు. అంతలోనే దారుణం జరిగిపోయింది. ఆ చిన్నారి నడిరోడ్డుపైనే విగతజీవిగా పడిపోయింది. హైదరాబాద్ ఎల్బీనగర్లో జరిగిందీ ఘటన.
ఒకడు కారును కేర్లెస్గా రోడ్డు మీదే ఆపేశాడు. వెనుక నుంచి సయ్యద్, శశిరేఖ.. వాళ్ల కూతురైన రెండేళ్ల ధనలక్ష్మి బైక్ మీద వస్తున్నారు. అంతలోనే కారును ఆపిన వ్యక్తి.. సడెన్గా డోర్ ఓపెన్ చేశాడు. వెనకాలే స్పీడ్గా వస్తున్న బైక్ మీదున్న చిన్నారి తలకు ఆ కార్ డోర్ తగిలింది. అంతే, బైక్ మీద నుంచి కుప్పకూలి రోడ్డు మీదే పడిపోయింది. ఘటనలో చిన్నారి తీవ్రగాయాలతో చనిపోయింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా ముందుకు రాలేదు ఆ కారు డ్రైవర్.
ప్రమాదం జరిగిన వెంటనే కారును నడిపిన దుర్గా ప్రసాద్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకుని.. దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేసి.. కారు సీజ్ చేశారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.