BRS Leaders : హైదరాబాద్ పర్యటనలో ప్రధాని స్పీచ్ పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని ప్రధాని మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం కొత్తగా ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణపై వివక్ష : సత్యవతి రాథోడ్
తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మోదీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. మిషన్ భగీరథ కోసం సహకరించమంటే పట్టించుకోలేదని తెలిపారు. 4 కోట్ల మంది తాగునీటికి డబ్బులు ఇవ్వమంటే మోదీకి మనసు రాలేదన్నారు. కానీ ఎమ్మెల్యేలను కొనడంకోసం కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
మోదీ ఇచ్చిందేంటి? : వినోద్ కుమార్
ప్రధాని మోదీపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రధాని స్పీచ్ ను తప్పుపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని చేసిన విమర్శలను ఖండించారు. దేశంలో అత్యంత అవినీతి పాలన బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే జరుగుతోందన్నారు. అవినీతి గురించి మోదీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని మోదీ మాట్లాడాన్ని తప్పుపట్టారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కుమారుడు ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శి పదవిలో లేరా అని నిలదీశారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ వారసత్వంగా రాజకీయాల్లోకి రాలేదా? అని ప్రశ్నించారు. జాతీయ రహదారులకు మోదీకి సంబంధం లేదన్నారు. అవన్నీ మన్మోహన్ సింగ్ హయాంలో ప్రకటించిన రహదారులే అని స్పష్టం చేశారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. తెలంగాణకు వచ్చి కొత్తగా మోదీ ఏం ఇచ్చారని ప్రశ్నించారు.
బాల్క సుమన్ ఫైర్..
బీజేపీ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షాతోపాటు ఎంపీలు అరవింద్, బండి సంజయ్ లవి ఫేక్ డిగ్రీలే అని ఆరోపించారు. త్వరలో నిజాలు బయటకు వస్తాయన్నారు. వారంతా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోతారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు రూపాయి ఇవ్వను అన్న కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు.