BRS Latest News(Telangana Updates): బీఆర్ఎస్ బిగ్ మీటింగ్. అందులో కేసీఆర్ కీలక కామెంట్స్. అక్టోబర్లోనే ఎన్నికలని.. మరో నాలుగు నెలలే గడువు ఉందని అన్నారు. నేతలు ప్రజల్లో ఉండాలని సూచించారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి మాత్రమే రాబోయే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని తేల్చి చెప్పారు గులాబీ బాస్. కొందరు ఎమ్మెల్యేలు దళిత బంధు లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని.. వారి చిట్టా తన దగ్గర ఉందని అన్నారు. అలాంటి వారికి టికెట్లు కాదుకదా.. పార్టీ నుంచే వెళ్లగొడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామం సిట్టింగులకు షాకింగ్గా మారింది. అనేక మంది ఎమ్మెల్యేల్లో టికెట్పై ఆశలు అడియాసలుగా మారుతున్నాయి.
సిట్టింగులందరికీ మళ్లీ టికెట్లు. ఇన్నాళ్లూ కేసీఆర్ చెప్పిన డైలాగ్. ఇప్పుడు టోన్ మారింది. ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే టికెట్లు అంటున్నారు. మరి, ఆ ఆదరణ ఎంత మందికి ఉంది? మిగతా వారికి టికెట్లు ఇవ్వరా?
అసలే కారు ఓవర్లోడ్తో ఉంది. ఒక్క నియోజకవర్గంలో ముగ్గురు, నలుగురు ఆశావహులు ఉన్నారు. టికెట్ మాకంటే మాకంటూ ఇప్పటికే బహిరంగంగా ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇక తమకు టికెట్ రాదని అంచనాకు వచ్చిన వారంతా పార్టీని పట్టుకుని ఉంటారా? టికెట్ హామీ ఇస్తే పక్క పార్టీలోకి జంప్ కొట్టరా? ఇదే చర్చ జోరుగా సాగుతోంది.
ఇప్పటికే తమతో 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ బీజేపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. అదంతా కేవలం మైండ్ గేమ్ అనుకోవడానికి లేదు. టికెట్ రాదని తెలిస్తే.. రాత్రికి రాత్రి కండువాలు మార్చే నేతలు చాలామందే ఉన్నారు. కేసీఆర్ కాదంటే.. కాషాయానికి జై కొట్టరా? కాంగ్రెస్ వైపు చూడరా?
బీజేపీకి కావాల్సింది ఇలాంటి వాళ్లే. ఆ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కొరత ఉంది. బలమైన నాయకుడు వస్తానంటే.. ఓవర్నైట్ బి-ఫామ్ ఇచ్చే అలవాటు కమలానికి ఉంది. కాకపోతే ఈసారి కాస్త ముందుగానే జంపింగ్స్ ఉండొచ్చని అంటున్నారు. కేసీఆర్ ఎవరెవరికైతే క్లాస్ ఇచ్చారో.. వారంతా సెట్రైట్ కావడంకంటే కూడా.. సెటిల్మెంట్ చూసుకునే ఛాన్సెసే ఎక్కువని చెబుతున్నారు.
గతంలో మాదిరి ఈ దఫా ఎన్నికల్లో కేసీఆర్కు వార్ వన్ సైడెడ్గా ఉండకపోవచ్చని సర్వేలను బట్టి తెలుస్తోంది. గులాబీ బాస్ మాత్రం గెలుపుపై ధీమాగా మాట్లాడుతున్నారు. అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కాదు.. లాస్ట్ టైమ్ కంటే ఎక్కువ సీట్లు రావడమే ముఖ్యమంటున్నారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా గెలుస్తాం.. అంటూ నేతలకు భరోసా ఇస్తున్నారు.
అదే సమయంలో కొందరు సిట్టింగులపై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఏమనుకోవాలి? అంటే, వారంతా ఓడిపోతారనే రిపోర్ట్ కేసీఆర్కు చేరిందనేగా అర్థం? మరి, అంతమంది ఓడిపోయే అవకాశం ఉంటే.. 100కు పైగా సీట్లు ఎలా వస్తాయో కేసీఆర్కే తెలియాలంటున్నారు.
ఇదే కరెక్ట్ టైమ్ అంటూ బీజేపీ మాత్రం ఆపరేషన్ ఆకర్ష్కు రెడీ అవుతోంది. రండి బాబు రండి.. అంటూ కాషాయ కండువాలను కప్పేందుకు చర్చలు షురూ చేసిందని తెలుస్తోంది.