BRS : BRS ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. నేటితో గులాబీ పార్టీ 22 వసంతాలు పూర్తి చేసుకుంది. 23వ వసంతంలోకి అడుగుపెట్టింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.
కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఇది పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలి సర్వసభ్య సమావేశం . ఈ మీటింగ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. మొత్తం 279 మంది ప్రతినిధులు వచ్చారు.
ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ జాగ్రత్తగా పనిచేసుకోవాలని హెచ్చరించారు. బాగా పనిచేసే వారికే టిక్కెట్లు ఇస్తానని తేల్చిచెప్పారు.
తెలంగాణ భవన్లో సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అక్టోబర్ 10న వరంగల్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపైనా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. త్వరలోనే విద్యార్థి, యువజన సమ్మేళనాల నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ 2 దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీకి పురుడు పోసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్ఠించారని ప్రశంసించారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. 22 ఏళ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు పార్టీకి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలని కేటీఆర్ ట్వీట్ చేశారు.
స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.. ఉజ్వల భారత్ కోసం నేడు బీఆర్ఎస్ అంటూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. పార్టీ కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందన్నారు. దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికిందన్నారు. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి మోడల్ను దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరారని అని హరీశ్రావు ట్వీట్ చేశారు.