Maneru Bridge Girders Collapsed : మానేరువాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కాలిపోయింది. రాత్రి భారీగా వీచిన ఈదురుగాలుల ధాటికి గర్మిళ్లపల్లి వైపు ఉన్న వంతెన పిల్లర్లు 17,18 లపై 5 గడ్డర్లు ఒక్కసారిగా కిందపడిపోయాయి. భారీశబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
9 ఏళ్లుగా నత్తనడకన పనులు సాగుతున్న వంతెన కూలడంతో.. ఎంత నాణ్యతాలోపంతో పనులు చేస్తున్నారో మరోసారి రుజువైంది. భారీ ఈదురుగాలుల వల్లే గడ్డర్లు కూలిపోయినట్లు పెద్దపల్లి జిల్లా ఆర్ అండ్ బీ ఇన్ఛార్జి అధికారి, ఈఈ నర్సింహాచారి వెల్లడించారు. ఘటనా ప్రాంతానికి అధికారులు చేరుకున్నారని..గడ్డర్లు కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపారు.
మానేరువాగుపై 2016లో రూ.47 కోట్ల అంచనా వ్యయంతో.. అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణ పనులు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల 22న తొలిసారి.. అర్థరాత్రివేళ వీచిన భారీ గాలులు 1,2 నంబర్ల పిల్లర్లలో మూడు గడ్డర్లు కిందపడిపోయాయి. అంతకుముందు మానేరు వాగుకు వరదలు పోటెత్తడంతో ప్రవాహం తాకిడికి సామాగ్రి దెబ్బతింది. కాంట్రాక్టర్లు కూడా మారుతూ వస్తుండటంతో వంతెన నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. పైగా 2 సంవత్సరాలుగా వాగులో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. తాజాగా మరో 5 గడ్డర్లు కూడా పడిపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది.