Hyderabad Metro latest updates(Telangana today news): హైదరాబాద్ మెట్రో రైలు మరో రికార్డు సృష్టించింది. ఈ నెల 3న 5.10 లక్షల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించారు. మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. కారిడార్-1 మియాపూర్–ఎల్బీనగర్ మార్గంలో ప్రయాణికుల సంఖ్యలో ఎక్కువగా ఉంది.
సోమవారం కారిడార్-1లో 2.60 లక్షల మంది ప్రయాణించారు. ఆ తర్వాత కారిడార్-3 నాగోల్– రాయదుర్గం మార్గం రెండో స్థానంలో ఉంది. ఈ రూట్ లో 2.25 లక్షల మంది జర్నీ చేశారు. రాయదుర్గం స్టేషన్ నుంచి అత్యధికంగా 32 వేల మంది ప్రయాణం చేశారు. ఎల్బీ నగర్ నుంచి 30 వేల మంది, అమీర్పేట్ నుంచి 29 వేల మంది, మియాపూర్ నుంచి 23 వేల మంది మెట్రోలో రాకపోకలు సాగించారు.
2017లో నవంబర్ 29న హైదరాబాద్ మెట్రోలో సర్వీసులు అందుబాటులో వచ్చాయి. 3 కారిడార్లలో 69 కిలో మీటర్లు మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తం 56 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. కరోనా ప్రభావంతో కొన్నాళ్లు ప్రయాణికుల సంఖ్య తక్కువ ఉండేది. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాలకు రావడంతో మెట్రోలో క్రమంగా రద్దీ పెరిగింది.
రోజు వారి మెట్రో ప్రయాణికులు 5.10 లక్షలు దాటిన నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతోందని తెలిపారు.